Share News

National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు నడ్డా సలహా..

ABN , Publish Date - Sep 08 , 2024 | 03:19 PM

బ్రిజ్ భూషణ్ సింగ్ గత రెండు రోజులుగా ఫొగట్, పునియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా పెద్ద ఎత్తున ఉద్యమించడంతో..

National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు నడ్డా సలహా..
Brij Bhushan Singh

ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా, బీజేపీ నేత, రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా మాజీ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ సింగ్ మధ్య వివాదం నడుస్తూనే ఉంది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఇద్దరు రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ సింగ్ లక్ష్యంగా చేసుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫొగట్‌కు కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. దీంతో బ్రిజ్ భూషణ్ సింగ్ గత రెండు రోజులుగా ఫొగట్, పునియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా పెద్ద ఎత్తున ఉద్యమించడంతో బీజేపీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ నిరాకరించింది. దీంతో వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వారిద్దరిపై నిరంతరం విమర్శలు చేస్తూనే ఉన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలాంటి పొరపాట్లు చేయకూడదని, పార్టీ నాయకుల వ్యవహారశైలితో ప్రతిపక్ష పార్టీలు లబ్ధి పొందకుండా ఉండేందుకు బీజేపీ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను పిలిపించి మాట్లాడారు. ఎన్నికల వేళ ఫొగట్, పునియాపై మీడియాతో ఎక్కువుగా మాట్లాడవద్దని సూచించారు.

Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ


బ్రిజ్ భూషణ్ ఏమన్నారంటే..

తనకు సంబంధంలేని మూడు ఘటనలకు తనను బాధ్యుడిని చేశారని.. ఎప్పటికైనా సత్యం గెలుస్తుందని బ్రిజ్ భూషణ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను పాండవులతో పోల్చిన ఆయన.. మహాభారత కాలంలో పాండవులు ద్రౌపదిని పణంగా పెట్టారన్నారు. ఇప్పటి వరకు పాండవులను దేశం క్షమించలేదన్నారు. దేశంలోని మహిళల పరువును పణంగా పెట్టి హుడా కుటుంబం ఆడిన ఆటను హర్యానా ప్రజలు క్షమించబోరన్నారు. రాజకీయ స్వార్థం కోసం ఇంతపెద్ద డ్రామా ఎందుకు సృష్టించారని ఆయన ప్రశ్నించారు. తాను ఇప్పటికీ మౌనంగా ఉండేవాడినని.. కానీ సాక్షి మాలిక్ ఇప్పటికీ మహిళల కోసం పోరాడుతున్నాని చెప్పడం వలనే స్పందించాల్సి వచ్చిందన్నారు. ఫొగట్, పునియా కాంగ్రెస్‌లో చేరడం కోసం అవాస్తవాలను ప్రచారం చేశారన్నారు. మహిళల పేరుతో ఎవరి కోసం వీళ్లంతా పోరాడుతున్నారని బ్రిజ్ భూషణ్ ప్రశ్నించారు. కేవలం ఒక కుటుంబం కోసం మాత్రమే పోరాడుతున్నారని ఆరోపించారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కారణంగా తన పరువు, ప్రతిష్టలతో పాటు రెజ్లింగ్‌కు నష్టం వాటిల్లిందని బ్రిజ్ భూషణ్ సింగ్ పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో కనీసం ఐదు పతకాలు సాధించేవాళ్లమని.. కానీ కొందరి కారణంగా పతకాలు రాలేదన్నారు. హర్యానా ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని బ్రిజ్ భూషణ్ సూచించారు.

Aadhaar New Rule: ఆధార్ కార్డు జారీ ఇక అంత ఈజీ కాదు


వినేశ్ ఫొగట్‌కు టికెట్..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నుండి వినేష్ ఫోగట్‌ను అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. బజరంగ్ పునియాను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఈ రెండు నియమాకాలు జరిగిన వెంటనే బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ.. బజరంగ్ పునియా హర్యానాకు హీరో కాదని.. విలన్ అంటూ విమర్శించారు. బజరంగ్ పునియా, దీపేంద్ర హుడా, భూపేంద్ర హుడా మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

IMD: ఐఎండీ అలర్ట్.. రేపు రాజస్థాన్ సహా 28 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 08 , 2024 | 03:19 PM