Share News

Bengaluru : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం

ABN , Publish Date - Jul 12 , 2024 | 05:47 AM

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) కుంభకోణం కలకలం రేపుతోంది. ఇందులో సీఎం సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరో ఇద్దరి ప్రమేయం.....

Bengaluru : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం

  • ముఖ్యమంత్రి సతీమణి ప్రమేయంపై ఆరోపణలు

  • ఆమెతో పాటు మరో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు

బెంగళూరు, జూలై 11(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) కుంభకోణం కలకలం రేపుతోంది. ఇందులో సీఎం సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. సిద్దరామయ్య, పార్వతి, ముడా అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన ఫిర్యాదును స్వీకరించలేదు.

ఇప్పటికే ముడాలో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. పార్వతికి ఆమె సోదరుడు 1998లో ఇచ్చిన భూమికి నష్ట పరిహారం లభించిందని సీఎం చెబుతుండగా.. ఆ భూమిని మల్లికార్జున 2004లో కొనుగోలు చేసి 2010లో పార్వతికి బహుమతిగా ఇచ్చారని స్నేహమయి కృష్ణ చెబుతున్నారు. ఈ భూమి అప్పటికే డీనోటిఫై చేసినా వ్యవసాయ భూమిగా తప్పుగా చూపారని ఆరోపించారు. ఆ తర్వాత ఆ భూమిని ముడా సేకరించిందని.. అందుకు పరిహారంగా 2021లో దక్షిణ మైసూరులో అత్యంత ఖరీదైన 38,283చ.గ. స్థలాన్ని పార్వతి పొందారని తెలిపారు.

అయితే ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల సహాయంతో ఫోర్జరీ పత్రాలతో మల్లికార్జున ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించారని స్నేహమయి కృష్ణ ఆరోపించారు. 1998లోనే ఆ భూమి కొనుగోలు చేసినట్టుగా చూపి, 2014లో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్వతి లబ్ధి పొందారని తీవ్ర విమర్శలు చేశారు. ముడాలో అక్రమాలు జరిగాయని సీఎం సతీమణి పార్వతి అనుచిత లబ్ధి పొందారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముడా సేకరించిన భూమి కంటే పరిహారంగా చెల్లించిన భూమి అనేక రెట్లు విలువైనదని..


ఫలితంగా రాష్ట్ర ఖజానాకు రూ.4000 కోట్లు నష్టం వాటిల్లిందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని శాసనసభలో ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందిస్తూ.. సీఎం, ఉపముఖ్యమంత్రి మధ్య అధిపత్య పోరులో భాగంగానే ఈ కుంభకోణం తెరపైకి వచ్చిందని తెలిపారు. ఈ వివాదంపై సిద్దరామయ్య స్పందించారు. ‘నా భార్యకు ముడా కేటాయించిన ఇంటి స్థలాల విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోంది. శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తే సమాధానం చెబుతా’ అన్నారు. ఒకే విషయాన్ని ఎన్నిసార్లు ప్రశ్నిస్తారని మీడియాపై మైసూరులో బుధవారం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడా నుంచి 50:50 నిష్పత్తిలో 2019లో బీజేపీ హయాంలోనే ఇంటి స్థలాలు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

Updated Date - Jul 12 , 2024 | 05:47 AM