Share News

Viral: గుండెల్ని పిండేసే విషాదం.. చావులోనూ కుమారుడి చెయ్యి పట్టుకొని..

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:22 PM

ఈ సృష్టిలో ఉన్న ప్రేమలన్నింటికీ రకరకాల అర్థాలు చెప్పొచ్చేమో గానీ.. తల్లి ప్రేమను మాత్రం ఏ ఒక్కరూ నిర్వచించలేరు. అసలు అమ్మ ప్రేమను మించింది ఏదీ లేదు. కడుపులో నవమాసాలు..

Viral: గుండెల్ని పిండేసే విషాదం.. చావులోనూ కుమారుడి చెయ్యి పట్టుకొని..
Delhi Rains

ఈ సృష్టిలో ఉన్న ప్రేమలన్నింటికీ రకరకాల అర్థాలు చెప్పొచ్చేమో గానీ.. తల్లి ప్రేమను మాత్రం ఏ ఒక్కరూ నిర్వచించలేరు. అసలు అమ్మ ప్రేమను మించింది ఏదీ లేదు. కడుపులో నవమాసాలు మోసే తల్లి.. ఆపై కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషిస్తుంది. పిల్లల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. చివరికి చావులోనూ తోడు విడిచిపెట్టదు. ఇందుకు అద్దంపట్టే ఓ హృదయవిదారక ఘటన దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) చోటు చేసుకుంది. మరణంలోనూ ఓ తల్లి తన కుమారుడి చెయ్యి పట్టుకున్న దృశ్యం.. అందరు మనసుల్ని కదిలించేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


కాలువలో పడి..

ఆ తల్లి పేరు తనూజ బిష్త్. బుధవారం సాయంత్రం కూరగాయలు కొనేందుకు ఆమె తన మూడేళ్ల కుమారుడితో కలిసి బయటకు వచ్చారు. మార్కెట్‌లో కొనుగోలు చేసిన తర్వాత వాళ్లు ఇంటికి తిరుగు పయనమయ్యారు. అయితే.. ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా రోడ్డంతా జలమయం అయ్యింది. దీంతో.. అక్కడే ఉన్న ఓ కాలువను వాళ్లు గమనించలేకపోయారు. ముందడుగు వేయగానే.. అందులో జారిపడ్డారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. కొన్ని గంటలు ముగిశాక.. 500 మీటర్ల దూరంలో తల్లి, కొడుకు విగతజీవులుగా కనిపించారు. ఆ దృశ్యం చూసి అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చావులోనూ ఆ తల్లి తన కుమారుడి చెయ్యి గట్టిగా పట్టుకొని ఉండటం చూసి.. స్థానికుల కళ్లల్లో నీళ్లు చెమర్చాయి.


భర్త ఆవేదన..

ఆ ఇద్దరి మరణవార్త విని తనూజ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై తనూజ భర్త గోవింద్ సింగ్ మాట్లాడుతూ.. వానలు పడినప్పుడల్లా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు విషయం తెలిసిన వెంటనే పోలీసులకు ఫోన్ చేశామని.. అధికారులతో పాటు సహాయక సిబ్బంది వచ్చినా వారి వద్ద తగిన పరికరాలు లేవని అన్నారు. ఎట్టకేలకు వాళ్లు రెండు గంటల తీవ్రంగా ప్రయత్నించి.. మృతదేహాలను బయటకు తీశారన్నారు. అప్పటికీ ఒక చిన్న ఆశతో వారిని ఆసుపత్రికి తరలించేందుకు ఆంబులెన్స్‌కి ఫోన్ చేశామని, కానీ అది అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ క్యాబ్‌లో తీసుకెళ్లామని ఆయన చెప్పుకొచ్చారు.


స్థానికుల ఆందోళన..

ఏ కాలువలో అయితే ఆ తల్లి, కొడుకు జారిపడి మృతి చెందారో.. అది గత మూడు నెలలుగా తెరిచే ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి అది పొంగి పొర్లుతుందని, తాము అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. చివరికి తాము ఎంపీతో పాటు ఎమ్మెల్యేలను సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వర్షం కారణంగా ఆ డ్రెయిన్ పొంగి పొర్లడంతో మృతురాలు తనూజ దాన్ని గుర్తించలేక పడిపోయిందని, ఒకవేళ అది మూసి ఉండే వాళ్లిద్దరు బతికే ఉండేవాళ్లని చెప్తున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Aug 01 , 2024 | 04:22 PM