Share News

Nitin Gadkari : కాంగ్రెస్‌ తప్పులు మనం చేయొద్దు

ABN , Publish Date - Jul 14 , 2024 | 04:38 AM

బీజేపీలో భిన్నమైన నేత కేంద్ర మంత్రి నితీన్‌ గడ్కరీ. తనదైన శైలిలో గోవాకు చెందిన బీజేపీ నేతలను శనివారం ఆయన అప్రమత్తం చేశారు. ‘‘కాంగ్రెస్‌ చేసిన తప్పులను మనమూ చేస్తే బీజేపీ అధికారంలో ఉండి ప్రయోజనం ఏమీ ఉండదు’’ అని ఆయన తేల్చేశారు.

 Nitin Gadkari : కాంగ్రెస్‌ తప్పులు మనం చేయొద్దు

పణజీ, జూలై 13: బీజేపీలో భిన్నమైన నేత కేంద్ర మంత్రి నితీన్‌ గడ్కరీ. తనదైన శైలిలో గోవాకు చెందిన బీజేపీ నేతలను శనివారం ఆయన అప్రమత్తం చేశారు. ‘‘కాంగ్రెస్‌ చేసిన తప్పులను మనమూ చేస్తే బీజేపీ అధికారంలో ఉండి ప్రయోజనం ఏమీ ఉండదు’’ అని ఆయన తేల్చేశారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మెజారిటీని కోల్పోయి, మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వంలోకి రావాల్సిన పరిస్థితిపై ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.

గోవా రాజధాని పణజీలో జరిగిన బీజేపీ కార్యవర్గ సభ్యులతో జరిగిన భేటీకి గడ్కరీ హాజరయ్యారు. ‘‘మిగతా పార్టీల కంటే బీజేపీ భిన్నంగా రాజకీయాల్లో కొనసాగుతోంది. అందువల్లే మనం వరుసగా గెలుస్తున్నాం. ఓటర్ల విశ్వాసాన్ని పొందగలుగుతున్నాం’’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. ‘బీజేపీ భిన్నమైన రాజకీయ పార్టీ’ అని ఆడ్వాణీ అనేవారంటూ ఆ పార్టీ కురువృద్ధనేతను ఆయన గుర్తుచేసుకున్నారు.

రాజకీయాలు అనేవి సమాజంలో సామాజిక, ఆర్థిక సంస్కరణలను తీసుకురావడానికి ఒక సాధనమనే విషయం పార్టీ కార్యకర్తలు అవగాహనలో ఉంచుకోవాలన్నారు. మహారాష్ట్ర కులాల రాజకీయాల్లో చిక్కుకుపోయిందన్న ఆయన.. తాను ఆ రొంపిలో దిగదలుచుకోలేదన్నారు. ‘కులాల గురించి మాట్లాడేవారి అధికారం కూలిపోతుంది’ అని నేను బలంగా నమ్ముతాను’’ అని తెలిపారు.

Updated Date - Jul 14 , 2024 | 04:39 AM