Share News

Legendary Industrialist : టాటాకు వీడ్కోలు

ABN , Publish Date - Oct 11 , 2024 | 03:28 AM

ప్రజలు మెచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. టాటా గ్రూప్‌ గౌరవ అధ్యక్షుడు.. రతన్‌ టాటా అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో, ముంబైలోని వర్లీ దహనవాటికలో జరిగాయి.

Legendary Industrialist : టాటాకు వీడ్కోలు

  • జనం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం

  • ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు

  • 21 సార్లు తుపాకులు పేల్చి పోలీసుల గౌరవ వందనం

  • అమిత్‌ షా, చంద్రబాబు, పవార్‌, సచిన్‌,అంబానీ, బిర్లా తదితరుల నివాళి

  • వేలాదిగా తరలివచ్చిన సామాన్యులు

  • హిందు, ముస్లిం, క్రైస్తవ, సిక్కు గురువుల ప్రార్థనలు

  • పార్శీ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు

  • ఒక రోజు సంతాప దినంప్రకటించిన 6 రాష్ట్రాల ప్రభుత్వాలు

  • టాటాకు ‘భారతరత్న’ ఇవ్వాలని మహారాష్ట్ర కేబినెట్‌ తీర్మానం

ముంబై, అక్టోబరు 10: ప్రజలు మెచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. టాటా గ్రూప్‌ గౌరవ అధ్యక్షుడు.. రతన్‌ టాటా అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో, ముంబైలోని వర్లీ దహనవాటికలో జరిగాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, మరో మంత్రి పియూష్‌ గోయల్‌, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఏపీ సీఎం చంద్రబాబు సహా ఎందరో ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై రతన్‌ టాటాకు నివాళులర్పించారు. తన దాతృత్వ గుణంతో అందరి మన్ననలూ చూరగొన్న ఆ వితరణశీలికి యావద్దేశంకన్నీటితో అంజలి ఘటించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, గుజరాత్‌ సహా ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయన మృతికి నివాళిగా ఒకరోజు సంతాపదినంగా ప్రకటించాయి. అధికారిక కార్యక్రమాలను సైతం రద్దు చేశాయి.

Untitled-3 copy.jpg

ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన రతన్‌ టాటా భౌతికకాయానికి.. నాసేసలార్లు (అంతిమ సంస్కారాలకు సంబంధించిన క్రియలు చేయించేవారు) గురువారం ఉదయాన్నే స్నానం చేయించి, తెల్లటి సుద్రేహ్‌ (అంగీ)్ట, నడుము చుట్టూ ‘కుస్తీ (పార్శీలు పవిత్రంగా భావించే తాడు)’ ధరింపజేశారు. పార్శీ పురోహితులు కొంతసేపు ప్రార్థనలు చేశారు. టాటా కుటుంబసభ్యులంతా ఆయనకు తుదినివాళులర్పించారు. ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సహా కొందరు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని శవపేటికలో ఉంచి, పుష్పాలతో అలంకరించి.. కుటుంబసభ్యులు, చివరిదశలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన శాంతను నాయుడు తదితరులు వెంటరాగా.. దక్షిణ ముంబైలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎన్‌సీపీ) ప్రాంగణానికి తరలించారు.


ఉదయం 10.30 గంటల నుంచి ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచారు. హిందు, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, పార్శీ మతగురువులు పక్కపక్కనే నిలబడి.. భుజంభుజం కలిపి.. ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ తన కుటుంబంతో సహా విచ్చేసి రతన్‌టాటాకు అంజలి ఘటించారు. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌, ఆదిత్యబిర్లా గ్రూపు అధిపతి కుమార్‌ మంగళం బిర్లా, సీనియర్‌ బ్యాంకర్‌ దీపక్‌ పరేఖ్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, ఆయన కుమార్తె సుప్రియ శూలె, ఎంఎన్‌ఎ్‌స చీఫ్‌ రాజ్‌ ఠాక్రే తదితర రాజకీయ, వ్యాపార ప్రముఖులు టాటా భౌతిక కాయాన్ని సందర్శించారు.

ఆయన్ను తమ రోల్‌మోడల్‌గా భావించే ప్రజలు వేలాదిగా తరలివచ్చి, పొడుగాటి క్యూలైన్లలో నిలబడి, నిరీక్షించి.. జాతీయ పతాకంలో చుట్టి ఉన్న రతన్‌ టాటాను చివరిసారి చూసుకుని కన్నీటి నివాళులర్పించారు. జనం పోటెత్తి ఒకదశలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడానికి తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. సాయంత్రం 3.55 గంటల అనంతరం రతన్‌ టాటా పార్థివదేహాన్ని.. అక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్లీ ఎలక్ట్రిక్‌ క్రిమెటోరియానికి తరలిస్తుండగా దారిపొడుగునా ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు.


  • కొంచెం భిన్నంగా..

క్రిమెటోరియానికి చేరుకున్నాక.. అక్కడి ప్రేయర్‌ హాల్‌లో 45 నిమిషాలసేపు ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత పోలీసులు 21సార్లు తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఎలక్ట్రిక్‌ దహనవాటికలో దహనం చేశారు. సంప్రదాయం ప్రకారం మిగిలిన మూడు రోజుల కార్యక్రమాలను కొలాబాలోని టాటా స్వగృహంలో పూర్తిచేస్తామని అంత్యక్రియలు నిర్వహించిన పురోహితుడు తెలిపారు. వాస్తవానికి పార్శీ సంప్రదాయం పక్రారం.. మరణానంతరం దహనం, ఖననం చేయరు. అలా చేయడం వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతాయని భావిస్తారు. మానవ దేహాన్ని ప్రకృతి ఇచ్చిన బహుమతిగా భావించి మళ్లీ ప్రకృతికే ఇవ్వాలని భావిస్తారు. అందులో భాగంగా.. ‘టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌’ లేదా ‘దఖ్మా’గా పిలిచే టవర్‌పై రాబందులకు వదిలిపెడతారు.

ఇలా చేయడాన్ని ‘దోఖ్మేనాశిని’గా వ్యవహరిస్తారు. భౌతికకాయాలను దహనం, ఖననం చేయడం వల్ల భూమి, గాలి, నీరు కాలుష్యమవుతాయనే ఉద్దేశంతో వారు ఇలా చేస్తారు. ఆ మృతదేహాలను రాబందులు తినేశాక.. అస్థికలు దఖ్మా కింది భాగంలో ఉన్న సెంట్రల్‌ వెల్‌లో పడిపోయి, డీకంపోజ్‌ అవుతాయి. అయితే, రాబందుల సంఖ్య తగ్గిపోయి అవి అంతరించే దశకు చేరుకున్న నేపథ్యంలో.. ఇటీవల చాలా మంది పార్శీలు తమ ఆప్తుల మృతదేహాలకు అంతిమ సంస్కారాలన్నీ పార్శీ సంప్రదాయంలో జరిపి, టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌పై వదిలిపెట్టడానికి బదులుగా ఎలక్ట్రిక్‌ దహనవాటికలో దహనం చేస్తున్నారు.

కొంతమంది.. సోలార్‌ కాన్సంట్రేటర్లను వినియోగిస్తున్నారు. 2022లో మరణించిన టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ అంత్యక్రియలు కూడా ఇదే తరహాలో వర్లీలోని ఎలక్ట్రిక్‌ దహనవాటికలో నిర్వహించడం గమనార్హం. నేలపై కట్టెలు పేర్చి దహనం చేయడం కాకుండా.. కరెంటును వాడతారు కాబట్టి నేల, నీరు, గాలి కలుషితం కావన్నది వారి విశ్వాసం. కాగా.. పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేసిన రతన్‌ టాటాకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను (మరణానంతరం) ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రతిపాదించారు. ఈమేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ.. మహారాష్ట్ర క్యాబినెట్‌ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

Updated Date - Oct 11 , 2024 | 03:28 AM