Share News

IND vs AFG: కోహ్లీ రాకతో తెలుగోడిపై వేటు తప్పదా?.. రెండో టీ20కి తుది జట్టు ఇదే!

ABN , Publish Date - Jan 13 , 2024 | 01:37 PM

Team india Playing 11: అప్ఘానిస్థాన్‌తో జరిగిన మొదటి టీ20లో విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

IND vs AFG: కోహ్లీ రాకతో తెలుగోడిపై వేటు తప్పదా?.. రెండో టీ20కి తుది జట్టు ఇదే!

ఇండోర్: అప్ఘానిస్థాన్‌తో జరిగిన మొదటి టీ20లో విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఆడనుండడంతో టీమిండియాకు మరింత బలం చేకూరనుంది. దీంతో 14 నెలల తర్వాత కింగ్ కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్ ఆడనున్నాడు. నిజానికి కోహ్లీ మొదటి మ్యాచ్‌లోనే బరిలోకి దిగాల్సి ఉంది. కానీ వ్యక్తిగత కారణాల దృష్యా ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఆడలేదు. అయితే రెండో టీ20 మ్యాచ్‌కు కోహ్లీ రానుండడంతో ఎవరిపై వేటు పడనుందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే గాయం కారణంగా చివరి నిమిషంలో మొదటి టీ20కి దూరమైన యశస్వి జైస్వాల్ జట్టులోకి వస్తే శుభ్‌మన్ గిల్‌కు తుది జట్టులో చోటు కష్టం కావొచ్చు. దీంతో మొదటి టీ20 మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.


మొదటి టీ20కి ముందు గాయపడిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ పూర్తిగా కోలుకుని జట్టులోకి వస్తే రోహిత్ శర్మకు జతగా అతనే ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ పరంగా చూస్తే జైస్వాల్ తుది జట్టులో ఉండడం ఖాయమనే చెప్పుకోవాలి. దీంతో శుభ్‌మన్ గిల్‌కు చోటు కష్టమే. పైగా ఈ మధ్య కాలంలో టీ20 క్రికెట్‌లో గిల్ అంతగా రాణించలేకపోతున్నాడు. విరాట్ కోహ్లీ రాకతో గత మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కూడా తుది జట్టులో చోటు ఉండకపోవచ్చు. తిలక్ వర్మ కూడా ఈ మధ్య కాలంలో అంతగా రాణించలేకపోతున్నాడు. గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శివమ్ దూబే నాలుగో స్థానంలో కొనసాగనున్నాడు. మొదటి టీ20లో కీలక ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ జితేష్ శర్మను రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించే అవకాశాలున్నాయి. దీంతో సంజూ శాంసన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావొచ్చు. మ్యాచ్ ఫినిషర్‌‌గా ఆరో స్థానంలో రింకూ సింగ్ ఆడనున్నాడు. మొదటి టీ20లో మాదిరిగా రెండో మ్యాచ్‌లోనూ భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ యూనిట్‌లో పెదగా మార్పులు ఉండే అవకాశాలున్నాయి. స్పిన్ ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టులో కొనసాగనున్నారు. ప్రధాన స్పిన్నర్‌గా గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన రవి బిష్ణోయ్ పరుగులు ఎక్కువగా ఇచ్చాడు. దీంతో అతని స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. పేస్ కోటాలో అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ స్థానాలకు ఢోకా లేదు.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్/శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్/కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.

Updated Date - Jan 13 , 2024 | 01:37 PM