Share News

High Court: బీఆర్‌ఎస్‌కు ఇచ్చిన 11 ఎకరాలు మావే..

ABN , Publish Date - Jul 18 , 2024 | 03:41 AM

కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ పార్టీకి కోకాపేటలో చేసిన 11 ఎకరాల భూకేటాయింపు చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలైంది.

High Court: బీఆర్‌ఎస్‌కు ఇచ్చిన 11 ఎకరాలు మావే..

  • కోకాపేట భూముల కేటాయింపుపై.. హైకోర్టులో ప్రైవేటు వ్యక్తుల పిటిషన్‌

  • అదనపు పత్రాలు సమర్పించాలని పిటిషనర్లకు ఆదేశం.. నేడు పునర్విచారణ

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ పార్టీకి కోకాపేటలో చేసిన 11 ఎకరాల భూకేటాయింపు చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలైంది. ప్రైవేటు వ్యక్తులకు చెందిన సదరు భూమిపై ఎలాంటి టైటిల్‌ లేనప్పటికీ ప్రభుత్వం భూకేటాయింపు చేసిందని, ఆ కేటాయింపును రద్దు చేయాలని కోరుతూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సికింద్రాబాద్‌ హైదర్‌బస్తీకి చెందిన జాకేటి అశోక్‌దత్‌ జయశ్రీ, కనుకాల జ్యోతిర్మయి దత్‌, జేఏ కీర్తిమయి, జేఏ అక్షయ్‌దత్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని సర్వే నెంబర్‌ 239, 240లలోని 11ఎకరాల (53,240 చదరపు గజాలు) భూమిని బీఆర్‌ఎస్‌ పార్టీకి కేటాయిస్తూ 2023 మే23న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


అయితే, ఈ భూమిపై యాజమాన్య హక్కులు తమకే ఉన్నాయని, వివాదస్పద భూమిపై ఎలాంటి టైటిల్‌ లేకున్నా, తనది కాని ఆస్తిని ప్రభుత్వం బీఆర్‌ఎ్‌సకు కేటాయించడం రాజ్యాంగవిరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. సదరు భూమి తమ కుటుంబ యజమాని జేఎం అశోక్‌దత్‌ నుంచి తమకు వారసత్వంగా సంక్రమించిందని తెలిపారు. రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌ డాక్యుమెంట్‌ నెంబర్‌ 928 ఆఫ్‌ 1967 ద్వారా జేహెచ్‌ కృష్ణమూర్తి అనే వ్యక్తి నుంచి తమ కుటుంబ యజమాని కొనుగోలు చేశారని పేర్కొన్నారు. తమకు భూమి విక్రయించిన జేహెచ్‌ కృష్ణమూర్తి లేట్‌ నవాబ్‌ నుస్రత్‌ జంగ్‌ - 1 వారసులకు పవర్‌ ఆఫ్‌ అటార్నీ హోల్డర్‌గా ఉన్నారని తెలిపారు. నవాబ్‌ నుస్రత్‌ జంగ్‌ -1 మహ్మద్‌ అలీఖాన్‌ వారసుల నుంచి రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ డాక్యుమెంట్‌ 17 ఆఫ్‌ రబీ అవాల్‌ 1269 హిజ్రిలో కొనుగోలు చేసిన 1,635 ఎకరాల్లో ఈ భూమి ఓ భాగమని తెలిపారు.


ఈ స్థలాలపై అనేక వివాదాలు ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఉన్నాయని పేర్కొన్నారు. 1950లో అప్పటి హైదరాబాద్‌ డెక్కన్‌ (నిజాం) ప్రభుత్వం కోకాపేట గ్రామాన్ని నాన్‌ ఖస్లగా గుర్తించిందని, ఈ నేపథ్యంలో సదరు భూములను ప్రభుత్వ భూములని చెప్పడానికి వీల్లేదని తెలిపారు. ఈ వివాదాలు ఇలా కొనసాగుతుండగా ఎలాంటి టైటిల్‌ దఖలు పడకుండానే ప్రభుత్వం ఈ భూమిని హెచ్‌ఎండీఏ నుంచి తీసుకుని బీఆర్‌ఎ్‌సకు కేటాయించిందని తెలిపారు. చట్టవిరుద్ధంగా చేపట్టిన ఈ కేటాయింపులను రద్దు చేయాలని, ఆ స్థలంలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా, అనుమతులు మంజూరు చేయకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం.. భూవివాదానికి సంబంధించిన కొన్ని రిజిస్ర్టేషన్‌ పత్రాలను సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.


కారు చవకగా కేటాయించారని ఇప్పటికే వ్యాజ్యాలు..

గత ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ పార్టీకి చేసిన ఈ భూకేటాయింపుపై ఇప్పటికే హైకోర్టులో పలు వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. కోకాపేటలో ఎకరం భూమి ధర రూ.50 కోట్లకుపైగా ఉండగా కేవలం ఎకరానికి రూ.3.41 కోట్ల చొప్పున గత ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ పార్టీకి కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సహ పలువురు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - Jul 18 , 2024 | 07:43 AM