Share News

..అయితే ఓకే!

ABN , Publish Date - May 20 , 2024 | 05:01 AM

ఒక రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతిచ్చింది. అయితే, కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్‌ 4లోపు చేయాల్సిన అత్యవసరమైన అంశాలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణ మాఫీ, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది.

..అయితే ఓకే!

  • రాష్ట్ర మంత్రివర్గ భేటీకి షరతులతో అనుమతిచ్చిన ఈసీ

  • జూన్‌ 4లోపు చేయాల్సిన

  • అత్యవసర అంశాలపైనే చర్చించాలి

  • రుణ మాఫీ, ఉమ్మడి రాజధానిపై మాట్లాడొద్దు

  • ఎన్నికల్లో భాగమైన అధికారులు పాల్గొనొద్దు

  • షరతులు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం

  • నేడు సచివాలయంలో కేబినెట్‌ సమావేశం

  • ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలు,

  • వానాకాలం పంటల ప్రణాళికపై భేటీలో చర్చ!

హైదరాబాద్‌, మే 19(ఆంధ్రజ్యోతి): ఒక రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతిచ్చింది. అయితే, కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్‌ 4లోపు చేయాల్సిన అత్యవసరమైన అంశాలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణ మాఫీ, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు సమావేశంలో పాల్గొనకూదని స్పష్టం చేసింది. ఆదివారం ఈసీ నుంచి ఈ మేరకు సమాచారం రావడంతో.. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్‌ భేటీ ఉంటుందని సీఎం శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశంపై మంత్రులందరికీ సమాచారం చేరవేశారు.


ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా దీనికి హాజరుకానున్నారు. కాగా, రాష్ట్రంలో ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. శనివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కోడ్‌ ఉన్నందున అనుమతి కావాలంటూ సీఈసీకి లేఖ రాసింది. వారినుంచి సమాధానం వస్తుందని శనివారం మధ్యాహ్నం నుంచి సీఎంతో పాటు మంత్రులు సచివాలయంలో ఎదురుచూశారు. అనుమతి రాకపోవడంతో రాత్రి 7 గంటల తర్వాత వెనుదిరిగారు. సోమవారం వరకు చూసి, స్పందన రాకుంటే మంత్రివర్గమే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికా్‌సరాజ్‌ సీఈసీ అధికారులతో చర్చించడం.. షరతులతో కూడిన అనుమతి రావడంతో సస్పెన్స్‌ వీడింది.


మరోవైపు ఈసీ షరతులను దృష్టిలో ఉంచుకుని.. ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలు, వానాకాలం పంటల ప్రణాళిక, జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల వంటివాటిపై మంత్రివర్గం చర్చించన్నుట్లు సమాచారం. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి రైతు రుణ మాఫీపై చాలా పట్టుదలగా ఉన్నారు. ఆగస్టు 15లోగా మాఫీ చేసి తీరుతామని పదేపదే చెప్పారు. ముందుగా అనుకున్న ప్రకారం.. క్యాబినెట్‌లో ఇదే కీలక అంశం అయ్యేది. కానీ, సీఈసీ షరతుతో చర్చకు అవకాశం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి, కోడ్‌ తొలగిపోయే నేపథ్యంలో జూన్‌ 4 తర్వాతనే చర్చించే వీలుంది. కాగా, రాజకీయంగా.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై మంత్రివర్గంలో సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Updated Date - May 20 , 2024 | 05:01 AM