Share News

TG News: ఢిల్లీ వరదల్లో తెలంగాణ విద్యార్థిని మృతి.. కేంద్ర మంత్రి దిగ్భ్రాంతి..

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:12 PM

ఢిల్లీలో భారీ వర్షాలకు ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన ముగ్గురిలో సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25ఏళ్ల యువతి ఉండడంతో ఆయన మనోవేదనకు గురైనట్లు చెప్పారు. వెంటనే మృతురాలు తానియా సోని తండ్రి శ్రీ విజయ్ కుమార్‌ను ఫోన్‌లో పరామర్శించారు.

TG News: ఢిల్లీ వరదల్లో తెలంగాణ విద్యార్థిని మృతి.. కేంద్ర మంత్రి దిగ్భ్రాంతి..

హైదరాబాద్: ఢిల్లీలో భారీ వర్షాలకు ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన ముగ్గురిలో సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25ఏళ్ల యువతి ఉండడంతో ఆయన మనోవేదనకు గురైనట్లు చెప్పారు. వెంటనే మృతురాలు తానియా సోని తండ్రి శ్రీ విజయ్ కుమార్‌ను ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. యువతి తండ్రి విజయ్ కుమార్ సింగరేణి శ్రీరామ్‌పూర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. విద్యార్థిని భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా కుటుంబసభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి పెండింగ్‌ ఫార్మాలిటీస్‌ను త్వరగా పూర్తి చేయాలని ఢిల్లీలోని తన కార్యాలయ సిబ్బందిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు.


ఢిల్లీ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందించారు. మృతులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఢిల్లీలో జరిగిన విధంగా తెలంగాణలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో అనేక కోచింగ్ సెంటర్లు అనుమతులు లేకుండానే నడుపుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. జీహెచ్ఎంసీలో ఎక్కువగా అవినీతి జరుగుతోందని, అక్రమ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. వాటిపైన జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టి సారించాలన్నారు.

అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆయన సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారని, అలాంటి ఘటనలపైనా సరైన యాక్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున భవనాలు నిర్మిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపై దృష్టి సారించి అక్రమ కట్టడాలకు చెక్ పెట్టాలని కోరారు.


ఢిల్లీలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఢిల్లీ ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. అయితే భారీ వర్షాలకు ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని రావ్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌లోకి వరదనీరు చేరింది. బేస్మెంట్‌లోని లైబ్రరీలో ముగ్గురు విద్యార్థులు చదువుకుంటుండగా ఒక్కసారిగా నీరు ముంచెత్తింది. దీంతో ఎటూ వెళ్లలేని స్థితిలో విద్యార్థులు తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28) నీట మునిగి మృతిచెందారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. మరికొంతమంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. దీనిపై 24గంటల్లో నివేదిక ఇవ్వాలని దిల్లీ మంత్రి అతిశీ రాష్ట్ర సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు.


అయితే మరోవైపు సెంట్రల్‌ దిల్లీలోని రావ్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌లోకి వరద పోటెత్తి ముగ్గురు మృతిచెందడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని రెండు వారాల క్రితమే అధికారులకు సమాచారం ఇచ్చామని అయిన వారు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. డ్రైనేజీలు బాగు చేయకపోవడంతోనే తమ స్నేహితులు చనిపోయినట్లు తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చిన్నచిన్న వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్లతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోచింగ్ సెంటర్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 03:20 PM