Share News

TG News: అక్రమాస్తుల కేసులో నరేందర్‌ను ఏసీబీ కోర్టుకు తరలించిన అధికారులు..

ABN , Publish Date - Aug 10 , 2024 | 11:19 AM

నగరపాలక సంస్థ సూపరింటెండెంట్, ఇన్‌ఛార్జి రెవెన్యూ అధికారి నరేందర్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుడు నరేందర్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు అధికారులు తరలించారు. అనంతరం ఇవాళ అతని బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు.

TG News: అక్రమాస్తుల కేసులో నరేందర్‌ను ఏసీబీ కోర్టుకు తరలించిన అధికారులు..

నిజామాబాద్: నగరపాలక సంస్థ సూపరింటెండెంట్, ఇన్‌ఛార్జి రెవెన్యూ అధికారి నరేందర్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుడు నరేందర్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు అధికారులు తరలించారు. అనంతరం ఇవాళ అతని బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు. దీంతో ఇంకెంత ఆస్తి బయటపడుతుందో అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే బంగారం, స్థిర, చర ఆస్తులు కలిపి మెుత్తం రూ.6.07కోట్లను ఏసీబీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అయితే ఇతర స్థిరాస్తులు ఏమైనా ఉన్నాయా అని విచారణ చేపట్టగా.. నిజామాబాద్, నిర్మల్, మహారాష్ట్రలో మరికొన్నింటిని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్‌లోని అతని నివాసం ఏసీబీ అధీనంలో ఉంది. కారుణ్య నియామకం ద్వారా బిల్ కలెక్టర్‌గా విధుల్లో చేరిన నరేందర్.. ప్రమోషన్లతో ప్రస్తుతం రెవెన్యూ అధికారిగా కొనసాగుతున్నారు.


నిన్న ఏం జరిగిందంటే..?

నిజామాబాద్‌ నగరపాలక సంస్థ సూపరింటెండెంట్, ఇన్‌ఛార్జ్ రెవెన్యూ అధికారి నరేందర్‌ బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లపై శుక్రవారం రోజు ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నాలుగు బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, నిర్మల్‌లో తనిఖీలు చేపట్టారు. అలాగే నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ సోదాలు చేశారు. నరేందర్ నివాసంలో రూ.2.93కోట్ల నగదు, 51తులాల బంగారు ఆభరణాలు, రూ.1.98 కోట్ల విలువైన 17స్థిరాస్తుల దస్త్రాలు, బ్యాంకు ఖాతాల్లో రూ.1.10కోట్లు గుర్తించారు. ఒక సూపరింటెండెంట్ ఇంట్లో ఇంత పెద్ద మెుత్తంలో ఆస్తులు గుర్తించడంతో ఏసీబీ అధికారులు సైతం అవాక్కయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన నిజామాబాద్‌ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఒకే చోట పనిచేయడంతో..

ఒకే చోట 25ఏళ్లుగా పని చేస్తుండడంతో నరేందర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. సూపరింటెండెంట్‌, ఇన్‌ఛార్జ్ రెవెన్యూ అధికారిగా ఉన్న నరేందర్ ఆస్తి పన్ను మదింపు, ఇళ్ల నంబర్లు కేటాయిస్తుండేవారు. కొంతకాలంగా ప్రభుత్వ స్థలాలకు ఇంటి నంబర్లు జారీ కావడం, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడంతో పలువురు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయాలల్లో అక్రమ రిజిస్ట్రేషన్ల విషయాన్ని గుర్తించారు. దీంతో ఏడాదిగా నిఘాపెట్టిన అధికారులు శుక్రవారం రోజున దాడులు నిర్వహించి పెద్దఎత్తున ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

HYDRA: అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా చెలరేగిపోతున్న హైడ్రా..

Crime News: అప్పటివరకూ దోస్త్ మేరా దోస్త్ అనుకున్నారు.. కాసేపటికే..!

Health News: మద్యంలో సోడా కలుపుకుని తాగితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

Updated Date - Aug 10 , 2024 | 11:57 AM