TG Govt: రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం శరవేగంగా అడుగులు
ABN , Publish Date - Jul 09 , 2024 | 08:38 PM
రైతు భరోసా పథకం అమలుపై రేవంత్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలన్న అంశంపై క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనున్నది.
![TG Govt: రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం శరవేగంగా అడుగులు](https://media.andhrajyothy.com/media/2024/20240707/Rythu_Bharosa_72f9799b86_v_jpg.webp)
హైదరాబాద్: రైతు భరోసా పథకం అమలుపై రేవంత్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలన్న అంశంపై క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనున్నది. రేపటి(బుధవారం) నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై వర్క్ షాప్లు నిర్వహించనున్నది. రైతులతో సమావేశమై వారిచ్చే సలహాలు, సూచనలను కూడా ఆచరణలోకి తీసుకోనున్నారు. 10న ఖమ్మం. 11,అదిలాబాద్, 12 మహబూబ్నగర్, 15 వరంగల్, 16 మెదక్, 18 నిజామాబాద్, 19 కరీంనగర్, 22 నల్గొండ, 23 రంగారెడ్డి ఆయా జిల్లాల వారీగా వర్క్షాపులు నిర్వహించనున్నది.
ఈ సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్లు వెంటనే నివేదిక రూపంలో పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.రైతు భరోసాపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉప సంఘం చైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ,సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఉన్నారు. ఈ అభిప్రాయ సేకరణలో జిల్లా మంత్రులతో పాటు, ఇన్చార్జి మంత్రులు కూడా పాల్గొననున్నారు.