Share News

Kidnap: సంగారెడ్డి ఆస్పత్రిలో కిడ్నాప్.. సంచలనం రేపుతున్న ఘటన..

ABN , Publish Date - Oct 09 , 2024 | 07:57 PM

సంగారెడ్డి జిల్లా మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణీ డెలివరీ నిమిత్తం మంగళవారం రాత్రి జిల్లా ఆస్పతిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సాధారణ కాన్పు సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు.

Kidnap: సంగారెడ్డి ఆస్పత్రిలో కిడ్నాప్.. సంచలనం రేపుతున్న ఘటన..

సంగారెడ్డి: ఇటీవల కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నవజాత శిశువుల అపహరణ పెరిగిపోయింది. కుటుంబసభ్యులు, బంధువులను ఏమార్చి అప్పుడే పుట్టిన చిన్నారులను కేటుగాళ్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. తమ ప్రాంతానికి దూరంగా తీసుకెళ్లి పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నారు. నవమాసాలు కష్టపడి కన్న తల్లులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి చిన్నారులను సొంత వారికి దూరం చేస్తున్నారు.


తాజాగా అలాంటి ఘటనే ఒకటి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణీ డెలివరీ నిమిత్తం మంగళవారం రాత్రి జిల్లా ఆస్పతిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సాధారణ కాన్పు సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన కాసేపటికే చిన్నారి కనిపించకుండా పోయింది. గుట్టుచప్పుడు కాకుండా శిశువును ఎత్తికెళ్లిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. నసీమాకు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో గది బయట ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా సంచరించినట్లు స్థానికులు తెలిపారు.


ఈ మేరకు సంగారెడ్డి పోలీసులకు ఆస్పత్రి సిబ్బంది, చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ముగ్గురు మహిళలపై బాలిక కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంపైనా విచారణ చేపట్టారు. ఆస్పత్రి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొన్ని పోలీసు బృందాలు మహిళల కోసం గాలిస్తున్నారు.

Updated Date - Oct 09 , 2024 | 07:57 PM