Share News

Minister Uttam: కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది

ABN , Publish Date - Jan 13 , 2024 | 07:49 PM

కాళేశ్వరం ( Kaleswaram ) మొత్తం ప్రాజెక్ట్‌పైన విచారణ కోసం హైకోర్టు చీఫ్ జడ్జికి లేఖ రాశామని.. సిట్టింగ్ జడ్జి విచారణ జరుపుతారని నీటి పారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) తెలిపారు.

Minister Uttam: కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది

హైదరాబాద్: కాళేశ్వరం ( Kaleswaram ) మొత్తం ప్రాజెక్ట్‌పైన విచారణ కోసం హైకోర్టు చీఫ్ జడ్జికి లేఖ రాశామని.. సిట్టింగ్ జడ్జి విచారణ జరుపుతారని నీటి పారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) తెలిపారు. శనివారం నాడు జలసౌదలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ...‘‘గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేసిన తప్పిదాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. ఈ ఏడాది కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఏడాది చివర నాటికి కొత్తగా 4.5 నుంచి ఐదు లక్షల ఎకరాలకు నీరందించే విధంగా ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి. నీటి పారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కవగా చేశారు. అందుకు తగిన ఫలితం రాలేదు. ఇప్పుడు అవసరమైన నిధులు వ్యయం చేసి కొత్త ఆయకట్టు సృష్టించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.

కొత్తగా ప్రాజెక్టులల్లో నీరందించే విషయంలో అడ్డంకులన్నీ అధిగమించి సకాలంలో నీరందించాలి. రాబోయే జూన్ నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులు, ఏడాది చివర నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులపై పనులు వేగవంతం చేయాలి. కృష్ణ, గోదావరి బేసిన్‌లలో సుమారు 18 ప్రాజెక్టులల్లో పలు ప్యాకేజీల కింద ఈ ఏడాది చివర నాటికి నీరందిస్తాం. రాబోయే ఐదేళ్లలో ఏ ప్రాజెక్టులల్లో కొత్త ఆయకట్టు ఎంత ఇస్తున్నామో సమాచారం సిద్ధం చేయాలి. కొత్త ఆయకట్టుకు నీరిచ్చే విషయంలో ఉన్న ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కొత్త ఆయకట్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మంథని నియోజక వర్గానికి నీరందించే పనులు చేపట్టాలి.రాబోయే వేసవి కాలంలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలి.యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వర్షాకాలం లోపు అన్ని చెరువుల పనులు పూర్తవ్వాలి. ఐడిసీ పరిధిలో ఉన్న అన్ని చిన్న ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో పని చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు కోయినా జలవిద్యుత్ ప్రాజెక్ట్ నుంచి వంద టీఎంసీ నీటిని తెలంగాణకు ఇవ్వాలని కోరుతున్నాం. మహారాష్ట్రకు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వ్యయం అందిస్తాం’’ అని మంత్రి ఉత్తమ్ సూచించారు.

Updated Date - Jan 13 , 2024 | 07:49 PM