Share News

Shadnagar: ఆస్ర్టేలియాలో షాద్‌నగర్‌ యువకుడి మృతి

ABN , Publish Date - May 25 , 2024 | 04:44 AM

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆస్ర్టేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వారం రోజుల క్రితం కారు రిపేరు కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. సిడ్నీ సమీపంలోని సముద్రంలో శవమై తేలాడు.

Shadnagar: ఆస్ర్టేలియాలో షాద్‌నగర్‌ యువకుడి మృతి

  • వారం క్రితం... తల్లి స్వదేశానికి వచ్చిన రోజే మిస్సింగ్‌

  • సముద్రంలో శవంగా తేలిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

షాద్‌నగర్‌, మే 24(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆస్ర్టేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వారం రోజుల క్రితం కారు రిపేరు కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. సిడ్నీ సమీపంలోని సముద్రంలో శవమై తేలాడు. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన దివంగత బీజేపీ నేత అరటి కృష్ణ యాదవ్‌-ఉషారాణిల దంపతుల ఏకైక కుమారుడు అరటి అరవింద్‌ యాదవ్‌. ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగరీత్యా ఆస్ర్టేలియాకు వెళ్లాడు. ఆ దేశంలో రోబో యంత్రాలు తయారుచేసే పరిశ్రమలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడ్డాడు. ఏడాదిన్నర క్రితం సిరివెన్నెల అనే యువతితో వివాహమైంది. అయితే, ఐదు రోజుల క్రితం అరవింద్‌ తన కారును రిపేర్‌ చేసుకుని వస్తానని భార్యకు చెప్పి ఇంట్లో నుంచి బయలు దేరాడు.


ఒకరోజు గడిచినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య.. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి గాలింపు మొదలుపెట్టారు. గురువారం సిడ్నీ సమీపంలో ఉన్న సముద్రంలో అరవింద్‌ యాదవ్‌(30) శవమై కనిపించాడు. పోలీసులు అరవింద్‌ది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ చేపట్టారు. కాగా, కుమారుడిని చూసేందుకు అరవింద్‌ యాదవ్‌ తల్లి ఉషారాణి ఇటీవల సిడ్నీ వెళ్లింది. మూడు నెలల పాటు అక్కడే ఉండి గత శనివారమే షాద్‌నగర్‌కు చేరుకుంది. ఇంతలోనే కొడుకు మరణవార్త తెలియడంతో తీవ్ర విషాదంలో మునిగి పోయింది. అరవింద్‌ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని షాద్‌నగర్‌ రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కిషన్‌రెడ్డి అక్కడి ప్రభుత్వానికి లేఖ రాశారు.

Updated Date - May 25 , 2024 | 04:44 AM