Share News

Dharani Portal: ధరణి పేరు భూమాతగా మార్పు?

ABN , Publish Date - Aug 01 , 2024 | 03:35 AM

ధరణి పోర్టల్‌ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో ఒక జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Dharani Portal: ధరణి పేరు భూమాతగా మార్పు?

  • సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో ఒకదానికి పీవీ పేరు?

  • నేడు క్యాబినెట్‌ భేటీ.. జాబ్‌ క్యాలెండర్‌పై చర్చ

హైదరాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో ఒక జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు శాసనసభ కమిటీ హాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్న రాష్ట్ర మంత్రి వర్గం ఈ అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ధరణి పేరును భూమాతగా మార్చనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ.. తన ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టింది.


అధికారంలోకి వచ్చాక సమస్యలపై అధ్యయనం కోసం కమిటీనీ ఏర్పాటు చేసింది. క్యాబినెట్‌ భేటీలో ఈ అంశాలన్నింటిపైనా చర్చించనున్నట్లు చెబుతున్నారు. రైతు, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ కమిషన్లకు చట్టబద్ధత కల్పించి.. చైర్మన్లకు క్యాబినెట్‌ హోదా ఇవ్వాలనుకున్నారు. సాంకేతిక కారణాలతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే ఈ కమిషన్లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.


ఈ కమిషన్ల ఏర్పాటు పైనా క్యాబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు.. క్రికెటర్‌ మహమ్మద్‌ సిరాజ్‌, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌లకు ఇళ్ల స్థలాలు, గ్రూప్‌-1 క్యాడర్‌లో ఉద్యోగాల కల్పనపైనా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జాబ్‌ క్యాలెండర్‌పైనా క్యాబినెట్‌ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థలకు ఎన్నికలు, ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Updated Date - Aug 01 , 2024 | 03:35 AM