Share News

Medical Colleges: 4 కొత్త వైద్య కళాశాలలకు లైన్‌క్లియర్‌

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:46 AM

రాష్ట్రంలో వైద్య విద్య మరింత మందికి చేరువ కానుంది. తెలంగాణలో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) అనుమతులిచ్చింది. ఇందుకు సంబంధించి ఎల్‌వోపీ(లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌)ను బుధవారం రాత్రి జారీ చేసింది.

Medical Colleges: 4 కొత్త వైద్య కళాశాలలకు లైన్‌క్లియర్‌

  • ఎల్‌వోపీ జారీ చేసిన జాతీయ వైద్య మండలి

  • పెరగనున్న సీట్లు.. ఈ ఏడాది నుంచే ప్రవేశాలు

  • పెండింగ్‌లో 4 కళాశాలల అనుమతులు

  • అప్పీలుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య విద్య మరింత మందికి చేరువ కానుంది. తెలంగాణలో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) అనుమతులిచ్చింది. ఇందుకు సంబంధించి ఎల్‌వోపీ(లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌)ను బుధవారం రాత్రి జారీ చేసింది. మొత్తం ఎనిమిది వైద్య కళాశాలల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసింది. ఇందులో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతినిచ్చింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కళాశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించవచ్చు. ఇక, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌, మెదక్‌ వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతులు మంజూరు చేయలేదు.


ఈ కళాశాలలకు ఎల్‌వోపీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లనుంది. నిజానికి, ఈ ఎనిమిది వైద్య కళాశాలలకు బోధనా వైద్యులు లేకపోవడంతో అనుమతులు ఇవ్వలేమని ఎన్‌ఎంసీ గత నెల 8న ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లకు లేఖలు రాసింది. దీనిపై అప్పీలుకు వెళ్లిన రాష్ట్రం.. లోపాల సవరణకు గడువు కోరింది. ఎన్‌ఎంసీ వర్చువల్‌గా తనిఖీ చేసే నాటికి అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, ఆస్పత్రులకు సూపరింటెండెంట్లను నియమించింది. దాంతో సంతృప్తి చెందిన ఎన్‌ఎంసీ నాలుగింటికి ఎల్‌వోపీ జారీ చేసింది. కాగా, ప్రభుత్వ, ప్రైవేటు కలపి రాష్ట్రంలోని 56 మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 8,515 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఇందులోని ప్రభుత్వ వైద్య కళాశాలలు 28 ఉండగా వాటిలో 3,915 సీట్లున్నాయి. కొత్తగా నాలుగు కాలేజీలకు అనుమతులు రావడంతో ఈ సీట్ల సంఖ్య మరో 200 పెరిగి 4,115కు చేరింది.


  • మరో రెండు కాలేజీలకు అనుమతులు !

ఎన్‌ఎంసీ పెండింగ్‌లో పెట్టిన నాలుగు వైద్య కళాశాలల్లో మెదక్‌, మహేశ్వరం కాలేజీలకు ఎల్‌వోపీలు వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండింటికి అనుబంధ ఆస్పత్రులు ఉండడమే ఇందుకు కారణం. ఇక, యాదాద్రి భువనగిరిలో అనుబంధ ఆస్పత్రి లేకపోవడంతో అక్కడ అనుమతులు రావడం కష్టమేనన్న భావన ఉంది. కుత్బుల్లాపూర్‌ మెడికల్‌ కాలేజీకి అనుబంధ ఆస్పత్రిగా దేనిని చూపాలనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కొత్తగా కట్టే టిమ్స్‌ ఆస్పత్రిని అనుబంధ ఆస్పత్రిగా చూపాలని అనుకుంటున్నారు. కుత్బుల్లాపూర్‌ మెడికల్‌ కాలేజీలో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు అధ్యాపక సిబ్బందిని నియమించారు. దాంతో కాస్త ఆలస్యంగానైనా ఈ కళాశాలకు ఎల్‌వోపీ వస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా, ప్రైవేటు యాజమాన్యాలు 3 కాలేజీల కోసం దరఖాస్తు చేయగా, వాటి అనుమతులపై స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - Aug 02 , 2024 | 04:46 AM