NTR Death Anniversary: టీడీపీకి భవిష్యత్తులో నాయకత్వం వహించేది ఆయనే..: బుద్దా వెంకన్న
ABN , Publish Date - Jan 18 , 2025 | 10:29 AM
టీడీపీ నేతలపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ కూడా లక్ష్మీపార్వతి పేరును ప్రస్తావించలేదని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని చెప్పుకునే లక్ష్మీపార్వతి టీడీపీలో ఎందుకు ఉండలేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

విజయవాడ: తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించారని.. వారికి రాజకీయ అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని అన్నారు. నాటి నుంచి నేటి వరకు టీడీపీకి బడుగు, బలహీన వర్గాలే ఆయువుపట్టు అని తెలిపారు.
ఎన్టీఆర్ విధానాలను చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లారని కొనియాడారు. ఎన్టీఆర్కు వారసుడు చంద్రబాబు అయితే.. ఆయనకు వారసుడు నారా లోకేష్ అని ఉద్ఘాటించారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును ఎన్టీఆర్ తీసుకువచ్చారని గుర్తుచేశారు. తమను కించపరుస్తున్నారని టీడీపీ నేతలపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ కూడా లక్ష్మీపార్వతి పేరును ప్రస్తావించలేదని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని చెప్పుకునే లక్ష్మీపార్వతి టీడీపీలో ఎందుకు ఉండలేదని ప్రశ్నించారు. టీడీపీని భూస్థాపితం చేయాలని చూసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలో ఎలా ఉన్నారని నిలదీశారు. జగన్తో చేతులు కలిపి చంద్రబాబును నీ నోటికి వచ్చినట్లు ధూషిస్తావా అని విరుచుకుపడ్డారు. టీడీపీని పెట్టింది ఎన్టీఆర్ అయితే... బతికించింది చంద్రబాబు అని గుర్తుచేశారు. దశ దిశలా ప్రజల నుంచి టీడీపీకి మరింత ఆదరణ పెరుగుతోందని అన్నారు. చంద్రబాబు, లోకేష్ల సారధ్యంలో టీడీపీ ప్రజాదరణ పొందుతుందని చెప్పారు. టీడీపీకి భవిష్యత్తులో నారా లోకేష్ నాయకత్వం వహిస్తారని బుద్దావెంకన్న పేర్కొన్నారు.
ఎన్టీఆర్కు భారతరత్న నిజమైన గౌరవం: రఘు రామకృష్ణంరాజు
హైదరాబాద్: ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయంగా జీవించి ఉంటారని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో రఘు రామకృష్ణంరాజు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రఘు రామకృష్ణంరాజు మాట్లాడుతూ.... చరిత్రలో మరణం లేని నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. గత ఏడాది ఇదే రోజు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని ఇక్కడే చెప్పానని.. అది నిజమైందని గుర్తుచేశారు. ఎన్టీఆర్కు భారతరత్న నిజమైన గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం వల్ల భారతరత్నకే గౌరవం వస్తుందని చెప్పారు. ఈ ఏడాది అది నిజమవుతుందని భావిస్తున్నానని అన్నారు. ఎన్టీఆర్ సంఘ సంస్కర్తనే కాదు.. సంక్షేమ పథకాలకు ఆద్యుడని తెలిపారు. పాలన దక్షిత ఉన్న నాయకుడు ఎన్టీఆర్ అని రఘు రామకృష్ణంరాజు కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి
NTR Death Anniversary:ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు: నందమూరి బాలకృష్ణ
Chandrababu's Achievements : జగన్ మాటలు.. బాబు చేతలు!
NTR Death Anniversary: తెలుగుదనానికి ప్రతిరూపం ఎన్టీఆర్ : మంత్రి నారా లోకేష్
Read Latest AP News and Telugu News