BRS MLC Kavitha: ఆ నివేదికను తక్షణమే బయటపెట్టాలి.. రేవంత్పై కవిత ప్రశ్నల వర్షం
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:46 PM
BRS MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లులో కేటగిరీ వారీగా రిజర్వేషన్లను రేవంత్ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీసీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల భవిష్యత్తు తరాలకు ఇబ్బంది అవుతుందని కవిత అన్నారు.

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కాకా కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందే కాంగ్రెస్ పార్టీ, మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అని కవిత విమర్శించారు. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ పదేళ్ల పాటు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వీపీసింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారని గుర్తుచేశారు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు బీసీల గురించి ఆలోచన చేయలేదని చెప్పారు. పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్చిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ వాదించారని తెలిపారు. రూ. 4300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం చేయించింది.. కానీ ఆ నివేదికను ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు. ఆ నివేదిక గురించి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీసీ వర్గీకరణ కోసం మోదీ ప్రభుత్వం వేసిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు.
బీసీ లెక్కలు తప్పు చెప్పొద్దు..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందో సమాధానం చెప్పాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల పాటు కాలయాపన చేసి తమ పోరాటాలతో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను నియమించిందని గుర్తుచేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కులాలు , గ్రామాల వారిగా బీసీ జనాభాను ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదని అడిగారు. బీసీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల భవిష్యత్తు తరాలకు ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
ఆ వివరాలు లేవు..
‘బీసీ రిజర్వేషన్ల బిల్లులో కేటగిరీ వారీగా రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు. ఏ గ్రూపునకు ఎంత రిజర్వేషన్లు కేటాయిస్తారన్న వివరాలు లేవు. న్యాయపరమైన చిక్కుల్లో ఈ చట్టాలు ఇరుక్కోకుండా చూడాలి. చిన్న చిన్న విషయాల మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే చట్టాలను కొట్టివేసే ప్రమాదం ఉంది. బీసీ సబ్ ప్లాన్ను ప్రభుత్వ రూపొందించాలి. బీసీలకు ఏటా రూ రూ.20 వేల కోట్ల మేర బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి గత ఏడాది కేవలం రూ.9200 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే అభివృద్ధిలో దేశం అమెరికాను దాటిపోయేది. మనంతల మనమే 50 శాతం జనాభాను అవకాశాలకు ఇన్ని సంవత్సరాల పాటు దూరం పెట్టడం బాధాకరం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అవకాశాలు దక్కితేనే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఎంతోమంది పోరాట వీరులు, త్యాగధనులు ఉన్నటువంటి బీసీ వర్గాలకు అందాల్సిన అవకాశాలు ఇంకా అందలేదు. ఉద్యోగ అవకాశాల్లో జాతీయస్థాయిలో 27 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా 23శాతం ఎప్పుడు భర్తీ కాలేదు. యూపీఎస్సీలో 27 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఉన్నా కూడా ఎప్పుడూ 8 శాతం అవకాశాలు కూడా దక్కలేదు. బీసీ వర్గాలు ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటున్నారు. దేశంలో 50శాతం జనాభా ఉన్న బీసీల వద్ద కేవలం 15శాతం మాత్రమే సంపద ఉంది. ఈ అసమానతలను సరి చేయాల్సిన అవసరం ఉంది. భిన్న వృత్తుల సమాహారమైన బీసీ వర్గాలకు ప్రభుత్వాలు అండగా నిలవాలి. కుల వృత్తుల వారు సంప్రదాయ ఆదాయ వనరులను కోల్పోయారు. అయినప్పటికీ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఆర్థిక సాధికారత కల్పించడానికి కృషి చేయకపోవడం బాధాకరం. బీసీలకు, మహిళలకు రాజ్యాంగ రక్షణ లేకపోవడం వల్ల విస్మరణకు గురవుతున్నారు. ఆర్థిక స్వతంత్రం, అధికారం, ఆత్మగౌరవం కోసం బీసీలంతా పోరాటం చేస్తున్నారు. అనేక బీసీ కులాలు దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తుండటం ఆందోళనకరం. సంచార జాతుల వారి పిల్లలకు విద్య విషయంలో ఎంతో ఆవేదన కలుగుతుంది. సంచార జాతుల వారి కోసం కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో ప్రత్యేకంగా కోటాను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకపోవడం దారుణం’ అని కవిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Dana Nagender serious statement: నేను సీనియర్ను.. మీరు చెప్తే నేను వినాలా.. దానం ఫైర్
DCP Vijay Kumar: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవ్వరినీ వదలం: డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్..
Read Latest Telangana News And Telugu News