BJP: ఫోకస్ అంతా అక్కడే!

ABN , First Publish Date - 2023-03-15T20:46:51+05:30 IST

తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్‌ను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కుదిపేస్తోంది.

BJP: ఫోకస్ అంతా అక్కడే!
JP Nadda

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉండగా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కమలనాథులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాల వైఫల్యాలను పెద్ద ఎత్తున ఎండగట్టాలని నిర్ణయించారు. అదే సమయంలో అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలపై లోతుగా చర్చించారు.

తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్‌ను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కుదిపేస్తోంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ విచారిస్తున్న తరుణంలో ఆమె అరెస్ట్ ఖాయమనే ప్రచారం ఉధృతంగా సాగుతోంది. దీంతో బీజేపీ ఈ విషయంలో బీఆర్ఎస్‌ నేతలపై ఒత్తిడి పెంచారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును తెలంగాణలో గ్రామగ్రామానికీ తీసుకెళ్లాలని కమలనాథులు యోచిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేయాలని కూడా నడ్డాతో ప్రధాన కార్యదర్శుల సమావేశంలో చర్చించారు.

అంతే కాదు కేంద్రంలో మోదీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నేతలు చర్చించారు. మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో బీజేపీ వెనుకబడిన 160 స్థానాలపై పూర్తిగా ఫోకస్ చేయాలని నిర్ణయించారు.

నడ్డాతో జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌(BL Santosh)తో పాటు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari ), వినోద్ తావ్‌డే, దిలీప్ సైకియా, సునీల్ బన్సాల్, కైలాస్ విజయవర్గీయ, సీటీ రవి, తరుణ్ ఛుగ్, దుశ్యంత్ గౌతమ్, అరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) నిన్న చేసిన ట్వీట్ ప్రకంపనలు రేపుతోంది. పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో(Port Blair Municipal Council election) బీజేపీ-టీడీపీ పొత్తు(BJP-TDP Alliance)తో సమైక్యంగా విజయం సాధించడం హర్షణీయమంటూ ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ-టీడీపీ కూటమికి అభినందనలు తెలియజేశారు. పోర్ట్బ్లెయిర్ ప్రజల కోసం చేసిన కృషి, అంకితభావం ఫలించాయని, ప్రధానిపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని నడ్డా ట్వీట్‌లో తెలిపారు.

పోర్ట్బ్లెయిర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా టీడీపీ అభ్యర్థి ఎస్.సెల్వీ ఎన్నికయ్యారు. మండలి ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి 14 ఓట్లు రాగా.. ప్రత్యర్థికి 10 ఓట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలను దాటి బయట మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా సెల్వీ ఎన్నికతో టీడీపీలో ఆనందం వెల్లివిరుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు అండమాన్ నికోబార్ టీడీపీ అధ్యక్షుడు ఎన్‌.మాణిక్యారావు యాదవ్ లేఖ రాశారు.

తెలుగుదేశం, బీజేపీ పొత్తులో భాగంగా సెల్వీ ఎన్నికయ్యారు. మొదటి మూడేళ్లు బీజేపీ అభ్యర్ధి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికవగా, పదవీకాలం పూర్తి కావడంతో చివరి రెండేళ్లకు టీడీపీ అభ్యర్ధి సెల్వీని టీడీపీ, బీజేపీ సభ్యులు చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ ఐల్యాండ్ టీడీపీ యూనిట్కు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ సెల్వీకి చంద్రబాబు అభినందనలు తెలిపారు.

తెలుగుదేశం, బీజేపీ పొత్తుపై నడ్డా చేసిన ట్వీట్‌పై అటు బీజేపీలోనూ, ఇటు టీడీపీలోనూ దీనిపై లోతుగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నాటికి రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా అనే కోణంలో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. పొత్తుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే కోణంలో నేతలు, కార్యకర్తలు చర్చలు జరుపుతున్నారు.

Updated Date - 2023-03-15T20:46:55+05:30 IST