Share News

Varla Ramaiah: అధికారం మీ చేతుల్లో ఉంటే అక్రమ నిర్మాణాలు చేపడతారా..?

ABN , Publish Date - Jun 25 , 2024 | 06:07 PM

మాజీ సీఎం జగన్ రెడ్డి మొసలి కన్నీరు కార్చడం ఇకనైన ఆపాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఉరుకుంటుందా.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు.

Varla Ramaiah: అధికారం మీ చేతుల్లో ఉంటే అక్రమ నిర్మాణాలు చేపడతారా..?
Varla Ramaiah

అమరావతి: మాజీ సీఎం జగన్ రెడ్డి మొసలి కన్నీరు కార్చడం ఇకనైన ఆపాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఉరుకుంటుందా.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు. 26 జిల్లాలో వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాల చొప్పున స్థలాలు అక్రమంగా కేటాయించారన్నారు. రూ. 900 కోట్ల విలువైన స్థలాలకు ఒక్కదానికి కూడా సరైన అనుమతులు తీసుకోలేదని చెప్పారు. అధికారంలో ఉంటే జగన్ ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటారా? రాష్ట్రం ఆయన సొంత జాగీరా? అని ప్రశ్నించారు.


అక్రమంగా నిర్మించి గగ్గోలు పెడుతున్నారా..?

‘‘మా కార్యాలయాలు పడగొడతున్నారంటూ ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గగ్గోలు పెడుతున్నారు. మీ కార్యాలయాలు పడగొట్టడంలో లేదు.. అక్రమంగా ఏ పర్మిషన్ లు తీసుకోకుండా నిర్మించిన కట్టడాలను మాత్రమే పడగొడుతున్నారు. ఈ విధ్వంసానికి కారకులు మీరు, పది మందికి ఉపయోగపడే ప్రజా వేదికను కూలగొట్టింది కూడా మీరే. అనుమతులు లేని కార్యాలయాలు పడగొడుతుంటే ఎందుకు గగ్గోలు పెడుతున్నారు. అధికారం మీ చేతుల్లో ఉంటే అక్రమ నిర్మాణాలు చేపడతారా? అన్ని జిల్లాల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు.సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి, గ్రీన్ ట్రిబునల్ ఆదేశాలు లెక్కపెట్టకుండా అక్రమంగా పార్టీ కార్యాలయాలను పంటకాలువలు, ప్రభుత్వ భూముల్లో కట్టడాలు చేపడితే చట్టం ఊరుకుంటుందా? పార్టీ కార్యాలయాలు అన్ని రాంకీ అయోద్యరామిరెడ్డి నిర్మిస్తారట.. ఎలా? వైసీపీ ఓడిపోతే దొడ్డిదారిన రాంకీ అయోధ్యరామిరెడ్డికి ఆ భవనాలను కట్టబెట్టేందుకు జగన్ రెడ్డి దురాలోచన చేశారు. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రాంకీ సంస్థకు ఏంటి సంబంధం ? జగన్ రెడ్డి లండన్ భవనంలోకి వెళ్తే.. ఈ భవనాలు అన్ని అయోధ్య రామిరెడ్డి పరం అవుతాయా? వైసీపీకి అధికారం ఇచ్చింది దోచుకు తింటానికా? పైగా నంగనాచి ఏడుపులు మొసలి కన్నీరు కారుస్తారా? 22.06.2015 న ఆత్మకూరు గ్రామంలో సర్వే నెం. 392 లో 3.65 ఎకరాల భూమిని జీవో నెం.228 ద్వారా టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం అప్పగించారు’’ అని వర్లరామయ్య మండిపడ్డారు.


చట్టబద్దంగా టీడీపీ ఆఫీస్..

‘‘లీజ్ డీడీ, సేల్ డీడీ, మార్డిగేజ్ డీల్, సీఆర్ డీ అనుమతి తర్వాతే మంగళగిరిలో జాతీయ పార్టీ కార్యాలయం నిర్మించారు. అనుమతులు అన్ని తీసుకున్న తర్వాతే చట్టబద్దంగా టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మించాం. ఆయినా ఆళ్ల రామకృష్టారెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ చెంప ఈచెంప వాయించారు. మీవి అన్ని అక్రమ కట్టడాలు, టీడీపీ భవనాలు సక్రమ కట్టడాలు. అన్ని అనుమతులు తీసుకున్నాం కాబట్టే జగన్ రెడ్డి చేయి టీడీపీ ఆఫీసుపై పడలేదు. తాడేపల్లిలో మీరు కట్టుకున్న ప్రధాన కార్యాలయానికి కార్పొరేషన్, సీఆర్డీఏ పర్మిషన్ తీసుకున్నారా సేల్ డీడ్ సరిగా ఉందా, మార్టిగేజ్ డీడ్ రాయించారా? ఎందుకు మొసలి కన్నీరు ? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ సైట్ విజయవాడలో పార్టీ కార్యాలయానికి కావాలంటే ఇవ్వడానికి వీళ్లేదని ఇరిగేషన్ శాఖ చెప్పింది..వాళ్లకు ఉన్న అనుమానాలు తీర్చి డిమాండ్ చేసిన డబ్బులు కట్టి చట్టబద్దంగా తీసుకోవడానికి సంవత్సరకాలం పట్టింది. మీకులాగా దోచేయండి, కొట్టేయండి అని మా చంద్రబాబు చెప్పరు. అధికారంలో మీరు ఉంటారని ఇలాంటి తప్పుడు పనులకు పూనుకున్నారు. ప్రజా వేదికను కూల్చిన మీకు ఈ కూల్చివేతలను అడిగే హక్కు మీకు లేదు. ఏ పర్మిషన్ లేకుండా అహంతో కట్టారు కాబట్టే చట్టం తనపని తాను చేసుకుంటూ పోయింది’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

Updated Date - Jun 25 , 2024 | 06:07 PM