Share News

YS Jagan: నాడు హేళన చేశారు.. నేడు పోరాడతామంటున్నారు..!

ABN , Publish Date - Jun 20 , 2024 | 01:52 PM

ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పక్షాన పోరాడటం రాజకీయ పార్టీల ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వంపై పోరాడి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రతిపక్షాల పాత్ర ఎనలేనిది. ఇప్పటివరకు ఎన్నో రాజకీయ పార్టీలు ప్రజాపోరాటాలతో వారి మన్ననలు పొంది అధికారంలోకి వచ్చాయి.

YS Jagan: నాడు హేళన చేశారు.. నేడు పోరాడతామంటున్నారు..!
YS Jagan

ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పక్షాన పోరాడటం రాజకీయ పార్టీల ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వంపై పోరాడి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రతిపక్షాల పాత్ర ఎనలేనిది. ఇప్పటివరకు ఎన్నో రాజకీయ పార్టీలు ప్రజాపోరాటాలతో వారి మన్ననలు పొంది అధికారంలోకి వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడతామనే పార్టీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపోరాటాలను నిర్లక్ష్యం చేయడం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అధికారంలో ఉన్న పార్టీలు ప్రజాపోరాటాలను నిర్లక్ష్యం రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉంటుందనడానికి నిదర్శనం ఏపీ ఎన్నికల ఫలితాలు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై పెద్ద వివాదమే జరిగింది. అయితే ఈ చట్టాన్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. కేవలం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మాత్రమే కాదు.. ఎన్నో ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు లేకపోలేదు.

Minister Nimmala Ramanaidu: పోలవరంలో ఎవరు, ఎలా దోచారో విచారిస్తాం


ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ పనితీరును గమనించిన ప్రజలు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదాను ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ.. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. మరోవైపు 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రజలకు సంబంధించిన ఏ సమస్యను లేవనెత్తినా ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోగా.. ప్రతిపక్షాలకు పనేం లేదంటూ కొందరు మంత్రులు హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వ పనితీరును ఎవరైనా ప్రశ్నిస్తే వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, అక్రమం కేసులు బనాయించడం వంటి చర్యలకు గత ప్రభుత్వం పూనుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ ప్రజల పక్షాన పోరాడాటమంటోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసమస్యలను పట్టించుకోని వైసీపీకి ప్రస్తుతం ప్రజలు గుర్తుకు వచ్చారా అంటూ కొంతమంది ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలను ప్రజల పక్షాన ప్రశ్నించడం విపక్షాల బాధ్యత.. అదే సమయంలో అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలను, ప్రజా సమస్యలను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా ఉద్యమాలను హేళనచేసి.. ఈరోజు ప్రజల పక్షాన పోరాడతామనడాన్ని ఏ విధంగా చూడాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

AP Politics: ముద్రగడ పేరు మారింది.. గెజిట్ విడుదల పేరు మారింది..


వేటిపై పోరాడతారు..

ముఖ్యంగా మూడు రాజధానులు వద్దు.. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే కొంతమంది కోటీశ్వరులు.. ఓ కులానికి చెందిన వ్యక్తులు రైతుల ముసుగులో ఉద్యమం చేస్తున్నారంటూ గత వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు హేళన చేశారు. ఈ ప్రభావంతో రాజధాని ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరూ విజయం సాధించలేదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలోనూ టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందంటూ చెప్పుకొచ్చారు. చివరకు ఆ యాక్ట్ వద్దని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీర్పునిచ్చారు.

Chandrababu: ఉద్దండ రాయునిపాలెంలో ప్రణమిల్లిన ఏపీ సీఎం చంద్రబాబు


ముఖ్యంగా రాజధాని విషయంలో టీడీపీ ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉంది. దీంతో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుతో రాజధాని సమస్యకు పరిష్కారం దొరికినట్లైంది. ఇక చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్టిన తొలి ఐదు సంతకాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఒకటి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నిరుద్యోగ యువత గత కొంతకాలంగా ఉద్యమిస్తున్నారు. మొదటి సంతకం డిఎస్సీ నియామకాలపై పెట్టడంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్లైంది. ఈ విధంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంది. ఇప్పుడు వైసీపీ వేటిపై పోరాడుతుంది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయవద్దని అడుగుతుందా.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వద్దని అడుగుతుందా.. అమరావతి రాజధాని నిర్మాణం వద్దు.. ప్రజలు తిరస్కరించిన మూడు రాజధానులనే ఏర్పాటు చేయాలని అడుగుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రానున్న ఐదేళ్ల కాలంలో వైసీపీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది.. ఏ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ముందుకెళ్తారనేదానిపై మరికొద్దిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Pawan Kalyan: పలు శాఖల అధికారులతో సమీక్షలు.. బిజీబిజీగా పవన్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 20 , 2024 | 02:32 PM