Share News

CM Revanth Reddy: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 10 , 2024 | 02:40 PM

పరిగి మండలం చిగురాల్‌పల్లిలో ఎరోళ్ళ మల్లమ్మ అనే వృద్ధురాలి దీన గాథపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వృద్ధురాలికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కీలక ఆదేశాలు

వికారాబాద్: పరిగి మండలం చిగురాల్‌పల్లిలో ఎరోళ్ళ మల్లమ్మ అనే వృద్ధురాలి దీన గాథపై ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వృద్ధురాలికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వృద్ధురాలు 8ఏళ్లుగా బాత్ రూమ్‌లో నివసిస్తున్న విషయాన్ని తెలుపుతూ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, సీఎంవోకి ట్యాగ్ చేస్తూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ట్వీట్ చేసింది. గంటల వ్యవధిలోనే స్పందించిన సీఎం రేవంత్ బాధితురాలి పరిస్థితిపై చలించిపోయి.. సాయం చేశారు. స్థానిక అధికారులు వెంటనే ఆమెను కలవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇళ్లు కూడా మంజూరు చేసేలా తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఏబీఎన్ కథనంపై సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


Both-Room-House.jpg

విషయం ఇదీ..

పరిగి మండలం చిగురాల్‌పల్లిలో ఎరోళ్ళ మల్లమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమెకు ఉండేందుకు ఇల్లు లేక స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మంజూరైన మరుగుదొడ్డిలో నివాసం ఉంటోంది. 20 ఏళ్ల క్రితమే భర్త చనిపోగా నానా కష్టాలు పడి ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. శిథిలావస్థలో ఉన్న ఈమె చిన్న ఇల్లు భారీ వర్షాలకు 15 ఏళ్ల క్రితమే కూలిపోయింది. ఆ తర్వాత చిన్న గుడిసెలో నివాసం ఉంది. కాల క్రమేణా అది కూలడంతో మరుగుదొడ్డినే ఇల్లుగా మార్చుకుంది మల్లమ్మ. దురదృష్టవశాత్తు అనుకోకుండా మల్లమ్మ కూతురు భర్త చనిపోయాడు. దాంతో కూతురు, ముగ్గురు పిల్లలతో కలిసి మల్లమ్మ అదే బాత్రూంలో ఉంది. కొద్దిరోజుల తర్వాత బతుకు జీవనం భారంగా మారి.. మల్లమ్మ కూతురు పొట్టకూటి కోసం పిల్లలతో పాటు హైదరాబాద్ వలస వెళ్లింది. కానీ.. 8 ఏళ్లుగా మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటోంది. మల్లమ్మ వైపు ఏ ప్రభుత్వం, ఏ ప్రజాప్రతినిధి కన్నెత్తి చూడలేదు. ఇప్పుడామె ఉంటోన్న మరుగుదొడ్డి కూడా శిథిలావస్థకు చేరింది. దాంతో ప్రభుత్వం స్పందించి తన బాధను తీర్చి.. ఇల్లు మంజూరు చేయాలని మల్లమ్మ కోరింది.


Both-Room-House-2.jpg

ఈ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడమే కాకుండా డైరెక్టుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎంవో కార్యాలయానికి ట్వీట్ చేసింది. ఆమెకు ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఆమె ఆరోగ్యం కూడా బాగోలేదంటూ ట్వీట్‌లో పేర్కొంది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ వెంటనే చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Sep 10 , 2024 | 03:06 PM