Share News

Etala Rajender: సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

ABN , Publish Date - Jul 29 , 2024 | 10:12 PM

వ్యవసాయం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సంపూర్ణంగా స్వాగతించాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) పేర్కొన్నారు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిందన్నారు.

Etala Rajender: సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
Etala Rajender

న్యూ ఢిల్లీ: వ్యవసాయం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సంపూర్ణంగా స్వాగతించాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) పేర్కొన్నారు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో వేలాదిమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 వరకు వ్యవసాయం కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.


నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-15 లో వరికి రూ.1360 కనీస మద్దతు ధరను కల్పించారని.. ఈరోజు రూ.2320 లు ఉందని వివరించారు. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్‌ను నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందని ఉద్ఘాటించారు. సహజ సిద్ధమైన వ్యవసాయం ద్వారా దిగుబడి తగ్గుతుండవచ్చు కానీ.. కేన్సర్లు, కిడ్నీ రోగాలు రాకుండా ఉండాలని మోదీ సర్కార్ ఈ ఆలోచన చేస్తుందని చెప్పుకొచ్చారు. డబ్బుల కోసం కాదు ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచన చేస్తుందని తెలిపారు. గత ఎన్డీఏ ప్రభుత్వ మంత్రివర్గంలో 12 మంది దళితులు, ఎనిమిది మంది ఎస్టీలు, 27 మంది ఓబీసీలు మంత్రులుగా ఉన్నారని ఈటల రాజేందర్ తెలిపారు.


మోదీ ప్రభుత్వంలో దళితులకు ప్రాధాన్యం

ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల గురించి బీజేపీ ఆలోచన చేసిందని వివరించారు. 2014లో మోదీ హయాంలో ఒక దళిత బిడ్డను రెండోసారి ఒక ఆదివాసి అడవి బిడ్డను రాష్ట్రపతిగా చేశారని గుర్తుచేశారు. ఓబీసీని ఈ దేశానికి ప్రధానమంత్రిని బీజేపీ చేసిందని తెలిపారు. దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ హయాంలో రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంను నియమించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన కూడా చేయలేదని చెప్పారు. దళిత జాతి గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. పార్లమెంట్లో తొలిసారిగా మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్రధాన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడిన మాటలు విన్నామని వ్యవసాయం, నిరుద్యోగం, సోషల్ జస్టిస్ గురించి చాలా మాటలు చెప్పారని ఈటల రాజేందర్ అన్నారు.


నిరుద్యోగుల సంక్షేమం

‘‘సోషల్ జస్టిస్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. తెలంగాణలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక దళితుడు, గిరిజనుడు, ఓబీసీ కానీ ముఖ్యమంత్రి కాలేదు. 2014, 2019లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటులో అపోజిషన్ పార్టీ గౌరవం కూడా దక్కలేదు. దేశంలో రూ.12 కోట్లతో టాయిలెట్లు కట్టించి ఆడవారి ఆత్మగౌరవాన్ని మోదీ కాపాడారు. ఈ పని కాంగ్రెస్ చేయలేదు. ఈ బడ్జెట్‌లో ఇన్నేళ్ల తర్వాత నిరుద్యోగుల కోసం ఆలోచన చేసి.. శిక్షణ ఇవ్వాలంటూ దానికి నిధులు కేటాయించడం స్వాగతించాల్సిన విషయం’’ అని ఈటల రాజేందర్ తెలిపారు.


ప్రపంచం ఆర్థిక మాంద్యంతో సతమతం..

‘‘భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉంది. అమెరికా సైతం ఈ సమస్యను ఎదుర్కొంటుంది. ప్రపంచం ఆర్థిక మాంద్యంతో సతమతమవుతుంది. భారతదేశం యువశక్తి ఉన్న దేశం. ఆ యువ శక్తిని ప్రోడక్టివిటీ దిశగా మలచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిధులు కేటాయించారు. ఇది అమలు చేస్తే ఐదో ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం మూడో ఆర్థిక శక్తిగా మారనుంది. నేను మాజీ ఆర్థిక మంత్రిని కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడిన మాటలు విన్నాను. ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాదని, పనికొచ్చే బడ్జెట్ కాదని, అపోజిషన్ పార్టీలు ఉన్న రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదని చేస్తున్న ఆరోపణలన్ని నిరాధారమైనవి’’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Updated Date - Jul 29 , 2024 | 10:38 PM