Share News

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. అధికార యంత్రాంగం అప్రమత్తం

ABN , Publish Date - Jun 07 , 2024 | 09:13 PM

తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shantikumari) సంబంధిత అధికారులతో నేడు(శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. అధికార యంత్రాంగం అప్రమత్తం

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shantikumari) సంబంధిత అధికారులతో నేడు(శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.ఆకస్మికంగా కుండపోత వర్షం కురిస్తే కలిగే ట్రాఫిక్ జామ్‌లను నివారించడం, జనజీవనం స్థంభించకుండా ఏం చేయాలనే విషయంపై అధికారులతో సమావేశంలో చర్చించారు.


భారీ వర్షం పడితే తక్షణం చేపట్టాల్సిన చర్యలతో పాటు శాశ్వత నివారణ చర్యలపై శాంతి కుమారి సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి డీజీపీ రవిగుప్తా, విపత్తుల నిర్వహణ, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగి రెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు. కుండపోతగా కురిసే భారీ వర్షాల వల్ల నగర వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని.. వీటిని నివారించడం, పూర్తిగా తగ్గించడానికి తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. వెదర్ ఫోర్ కాస్ట్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు, పౌర సమాజాల వాట్సాప్ గ్రూపులకు పంపి చేపట్టాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తెలియ చేయాలని సూచించారు.


వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకందించేదుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 134 ప్రాంతాలను ప్రమాద తీవ్రతను కలిగించేవిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో తిరిగి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్, ఎస్పీడీసీఎల్ తదితర శాఖల అధికారులు ఒక కమిటీగా ఏర్పడి ఈ వాటర్ లాగింగ్ పాయింట్లను తనిఖీ చేసి, వీటి నివారణకు తగు సూచనలను చేయాలని సీఎస్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో వర్షపు నీటిని నిలువ చేసేందుకు పలు ప్రాంతాల్లో భారీ నీటి నిల్వ ట్యాంకులను నిర్మిస్తున్నామని, వీటిలో ఇప్పటికే మూడు ట్యాంకుల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.


జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డిజాస్టర్ రెస్పాన్స్ విభాగాన్ని మరింత పటిష్టపరచడానికి చేపట్టాల్సిన చర్యలను సూచించాలని శాంతి కుమారి కోరారు. నగరంలో ప్రధానంగా సైబరాబాద్ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో రహదారులపై వాహనాలు బ్రేక్ డౌన్ అయితే, వాటిని వెంటనే తొలగించడానికి అదనపు క్రేన్ లను అందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ఆకస్మిక వర్షాల వల్ల, నీటి నిల్వలు, వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే స్పందించడానికి జీహెచ్ఎంసీ, జలమండలి, ఎస్పీడీసీఎల్, పోలీస్‌లకు చెందిన 630 మాన్‌సూన్ సహాయక బృందాలు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంచామని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు.

Updated Date - Jun 07 , 2024 | 09:14 PM