Share News

Bhatti Vikramarka: తెలంగాణలోని యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం గాలికొదిలేసింది

ABN , Publish Date - Sep 05 , 2024 | 10:41 PM

గత పది సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు(గురువారం) రవీంద్ర భారతిలో గురుపూజోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 Bhatti Vikramarka: తెలంగాణలోని యూనివర్సిటీలను కేసీఆర్  ప్రభుత్వం గాలికొదిలేసింది
Mallu Bhatti Vikramarka

హైదరాబాద్: గత పది సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఆరోపణలు చేశారు. ఈరోజు(గురువారం) రవీంద్ర భారతిలో గురుపూజోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.


రాష్ట్రంలో 27, 862 విద్యాలయాలకు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తును అందిస్తోందని చెప్పారు. విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తోందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. గత దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రంలో డీఎస్సీని నిర్వహించలేదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11, 062 పోస్టులకు నోటిఫికేషన్ వేయడంతో పాటు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరో 6వేల పైబడి పోస్టులకు నోటిఫికేషన్ వేయడానికి భవిష్యత్తు ప్రణాళికను తయారుచేసి ముందుకు పోతున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉపాధ్యాయులు పదోన్నతికి, బదిలీలకు నోచుకోలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 45 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు చేశామని గుర్తుచేశారు. 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యా విధానం మారాలని పాఠశాలల్లో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు వేసి వాటి నిర్వహణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించి  ప్రభుత్వం 667 కోట్ల రూపాయలను వెచ్చించిందని భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లు లేకపోవడం వల్ల గురువులే పాఠశాలను శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి ఉండేదని అన్నారు. గత పాలనలో ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. ఆ పరిస్థితి పోవాలని ఈ ఆర్థిక సంవత్సరం శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు 136 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు గుర్తుచేశారు. ఇప్పటివరకు పరిశ్రమలకు పనికి వచ్చే సిలబస్ అందుబాటులో లేకపోవడం వల్ల పరిశ్రమలు అభివృద్ధి కూడా వెనకడుగు పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో 63 ఐటీఐ కళాశాలలను  అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్‎గా ఏర్పాటు చేసి ఆధునాతన సాంకేతిక విద్యా బోధన అందిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ ఆర్థిక సంవత్సరం 300 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో గురువులకు ఉపపయోగపడే మంచి ఆలోచనలు కచ్చితంగా తీసుకుంటామని అన్నారు. ఉపాధ్యాయులతో  మాట్లాడి చర్చించిన తర్వాతే విధానపరమైన నిర్ణయాలు తయారు చేస్తామని భట్టి విక్రమార్క వివరించారు.


ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ నిర్మాణం కావడానికి గురువుల పాత్ర కీలకంగా ఉపయోగపడాలని సూచించారు. విద్యా బుద్ధులతో పాటు మంచి అలవాట్లు, సంస్కారం నేర్పించిన మానవ వనరులు సమాజంలో ఉన్న చాలా రుగ్మతలను ఎదుర్కొని సమాజానికి ఉపయోగపడతారని అన్నారు. సమాజం మనుగడ కోసం పునాదులు వేయాల్సింది గురువులేనని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియంతో పాటు ఆంగ్ల మీడియం చెప్పాలని ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రోత్సహించి ఉపాధ్యాయు విద్యార్థులు రాణిస్తున్నారని భట్టి విక్రమార్క వెల్లడించారు.


సమాజ నిర్మాణంలో ప్రపంచంతో పోటీపడే విధంగా మానవ వనరులను తయారు చేయడానికి ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అమలు చేయడానికి ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. అభ్యుదయ భావాలతో గురువులు ఉండటం వల్ల ఆ స్ఫూర్తితో ఈ రాష్ట్రం ప్రగతిశీలంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.‌ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది గురువులు గొప్ప వాళ్లు ఉండటం, ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగి ఉన్నందుకు సంతోషంగా గర్విస్తున్నానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

Updated Date - Sep 05 , 2024 | 10:53 PM