Share News

క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డే!

ABN , Publish Date - Aug 21 , 2024 | 03:46 AM

ప్రస్తుత రాజకీయాల్లో క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డే!

  • రాజీవ్‌ విగ్రహాన్ని తీసేస్తా అనేందుకు కేటీఆర్‌ ఎవ్వడు? .. ఇదేమైనా ఆయన అయ్య జాగీరా?

  • రాజీవ్‌ తెచ్చిన టెక్నాలజీతోనే కదా.. కేటీఆర్‌ ఉద్యోగం తెచ్చుకున్నది

  • బీఆర్‌ఎ్‌సకు మళ్లీ అధికారం కలే కేటీఆర్‌పై తూర్పు జగ్గారెడ్డి ఫైర్‌

  • ఐటీకి ఆద్యుడు రాజీవ్‌గాంధీనేనంటూ కేసీఆర్‌ మాట్లాడిన వీడియో ప్రదర్శన

హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత రాజకీయాల్లో క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తీసేస్తానని ప్రకటించేందుకు కేటీఆర్‌ ఎవ్వడన్నారు. తెలంగాణ ఏమైనా కేటీఆర్‌.. లేకుంటే ఆయన అయ్య జాగీరా అంటూ నిలదీశారు. రాజీవ్‌ విగ్రహాన్ని ఆయన తీసేస్తుంటే తాము చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అయినా బీఆర్‌ఎస్‌ పార్టీకి మళ్లీ అధికారం రావడం కలేనని, ఇంక రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయం పేరు ఎలా మారుస్తారని నిలదీశారు.

గాంధీభవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడైనా రాజకీయ శిక్షణ కేంద్రం ఉంటే.. అందులో కేటీఆర్‌ శిక్షణ తీసుకుంటే మంచిదని సూచన చేశారు. ఆయనకు ఏం మాట్లాడాలో, ఎలాంటి విషయాలు మాట్లాడాలో తోచట్లేదని, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

‘‘దేశ ప్రజల కోసం బలిదానం అయిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెడతామంటే తీసేస్తానంటడా? కేసీఆర్‌ గారూ.. మీ అబ్బాయి కేటీఆర్‌కు కొద్దిగా రాజకీయ శిక్షణను ఇప్పించండి’’ అని సూచించారు. కేటీఆర్‌ అమెరికాలో ఐటీ ఉద్యోగం చేశానంటున్నారని, ఆ ఐటీని దేశంలోకి తీసుకువచ్చింది రాజీవ్‌గాంధీనేనన్నారు. తెలంగాణలో ఐటీకి మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పునాది వేశారన్నారు.


రాజీవ్‌ తీసుకువచ్చిన టెక్నాలజీతో అమెరికాలో ఉద్యోగం తెచ్చుకున్న కేటీఆర్‌.. ఆ రాజీవ్‌గాంధీనే తిడితే ఆయన్ను ఏమనాలని ప్రశ్నించారు. ‘‘నువ్వు రాజీవ్‌ విగ్రహం తీసేస్తానంటే మేము చూస్తూ ఉరుకుంటామనుకుంటున్నవా? ప్రజలు మాకు అయిదేళ్లు అధికారం ఇచ్చినరు. వచ్చే నాలుగేళ్లూ రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ముట్టుకునే దమ్ము, ధైర్యం నీకు లేదు. మళ్లీ అయిదేళ్లూ ప్రజలు నీకు అధికారం ఇవ్వరు. తెలంగాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. నీకు నో చాన్స్‌!’’ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డిని.. చీప్‌ మినిస్టర్‌ అంటూ కేటీఆర్‌ సంబోధించడంపై స్పందిస్తూ..

కేటీఆర్‌ మాటలు చీప్‌ లిక్కర్‌ తాగినోడి మాటల లెక్కన ఉన్నాయని విమర్శించారు. సోనియా, రాహుల్‌గాంధీలకు తాము నీతిగా గులాం గిరీ చేస్తామని, కేటీఆర్‌ లెక్కన తాము మోసం చేసేవాళ్లం కాదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఇంటికి కేసీఆర్‌ కుటుంబం మొత్తం వెళ్లి ఆమె కాళ్లమీద పడ్డారని గుర్తు చేశారు. అప్పుడు వారు కూడా గులాంగిరీ చేసినట్లేనా అని నిలదీశారు. అల్లం నారాయణ మేధావి కాదని, ఆయన కేసీఆర్‌కు బంట్రోతు అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఆయన ఎప్పుడైనా జర్నలిస్టుల కష్టాలు, ఇళ్ల స్థలాల గురించి కేసీఆర్‌ను అడిగాడా అని నిలదీశారు. అల్లం నారాయణ ఓ జోకర్‌ అంటూ వ్యాఖ్యానించారు.


తల్లి గుండెల్లో ఉండాలి.. తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపల ఉండాలి

తల్లి గుండెల్లో ఉండాలని, అందుకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల తాము ప్రతిష్ఠించబోతున్నామని జగ్గారెడ్డి చెప్పారు. సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం ఎందుకు పెట్టవద్దని, అదేమైనా కేటీఆర్‌ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. ‘‘కేటీఆర్‌ కుస్తీకి వస్తే మేమూ సిద్ధం! రాజీవ్‌ విగ్రహం మీద చెయ్యి వేస్తే చెప్పుతో కొడతామంటూ సీఎం మాటలకు మద్దతు ఇస్తున్న. ప్రస్తుత రాజకీయాల్లో క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు మొగుడు రేవంత్‌రెడ్డే..!’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఐటీకి ఆద్యుడు రాజీవ్‌గాంధీనేనంటూ కేసీఆర్‌ గతంలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను జగ్గారెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు.

Updated Date - Aug 21 , 2024 | 03:54 AM