Share News

CM Revanth Reddy: నిఘా విభాగాలను ఆధునికీకరించాలి..

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:05 AM

తెలంగాణలో నిఘా విభాగాల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత నిఘా విభాగాలైన మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ, సైబర్‌ భద్రతా సంస్థలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

CM Revanth Reddy: నిఘా విభాగాలను ఆధునికీకరించాలి..

  • అవసరమైన నిధులు ఇవ్వండి

  • ఐపీఎస్‌ అదనపు పోస్టులు మంజూరు చేయండి

  • కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు రేవంత్‌, భట్టి విజ్ఞపి

న్యూఢిల్లీ, జులై 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నిఘా విభాగాల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత నిఘా విభాగాలైన మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ, సైబర్‌ భద్రతా సంస్థలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయన గురువారమిక్కడ ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి అమిత్‌ షాను కలిశారు. మాదకద్రవ్యాలు, సైబర్‌ నేరాల నియంత్రణకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాల కొనుగోలుకు నార్కోటిక్స్‌ బ్యూరోకు రూ.88 కోట్లు, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు రూ.90 కోట్లు కేటాయించాలని కోరారు. తెలంగాణకు సంబంధించి ఐపీఎస్‌ క్యాడర్‌ సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లకోసారి ఐపీఎస్‌ క్యాడర్‌ను సమీక్షించాల్సి ఉండగా, 2016 నుంచీ సమీక్ష నిర్వహించలేదని తెలిపారు.


రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేటాయించిన 61 ఐపీఎస్‌ పోస్టులు సరిపోవని, అదనంగా మరో 29 పోస్టులు కేటాయించాలని కోరారు. వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టేందుకు ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భద్రతా బలగాల క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్పీవోల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధనను సడలించాలని.. ఎస్పీవోలకు చెల్లించాల్సిన నిధుల్లో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.18.31 కోట్ల కేంద్ర వాటాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించని ఆస్తులు, సంస్థలు తమవేనని ఏపీ చెప్పుకుంటున్నందువల్ల తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు. శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో విభజన సమస్యలపై చర్చిస్తున్నామని రేవంత్‌ అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - Jul 05 , 2024 | 03:05 AM