Share News

Hyderabad : రేపు రాష్ట్ర బడ్జెట్‌

ABN , Publish Date - Jul 24 , 2024 | 03:51 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను గురువారం(ఈ నెల 25న) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం 27న బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపట్టి.. అదేరోజు సమాధానం ఇవ్వనుంది.

Hyderabad : రేపు రాష్ట్ర బడ్జెట్‌

  • 27న బడ్జెట్‌పై సాధారణ చర్చ..

  • 31న ఆమోదం

  • 26, 28న విరామం.. ఏడు పనిదినాలు

  • అసెంబ్లీ బీఏసీ సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను గురువారం(ఈ నెల 25న) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం 27న బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపట్టి.. అదేరోజు సమాధానం ఇవ్వనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో పద్దులపై చర్చ, ఆమోదం ఉంటాయి. 31న ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చించి ఆమోదిస్తారు.

బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మరుసటి రోజు.. 26న సభకు విరామం ఇవ్వనున్నారు. అలాగే హైదరాబాద్‌ బోనాల పండుగను దృష్టిలో పెట్టుకుని 28న కూడా విరామం ఇస్తున్నారు. మంగళవారం మొదలుకుని 31 వరకు మొత్తం ఏడు పనిదినాలు ఖరారయ్యాయి. కాగా, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన మంగళవారం అసెంబ్లీలోని ఆయన చాంబర్‌లో సమావేశమైన శాసనసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

తదుపరి సమావేశాలను పొడిగించాలా, వద్దా అన్నదానిపై నిర్ణయాధికారాన్ని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు అప్పగించింది. ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌లు బీర్ల అయులయ్య, బీఆర్‌ఎ్‌సఎల్పీ తరఫున మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎఐఎంఎల్పీ నుంచి మహ్మద్‌ బిన్‌ బలాలా, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.

15 రోజులైనా నిర్వహించాలి

ఈ నెల 25న బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. 31 కల్లా ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించుకునే ప్రతిపాదన పట్ల బీఆర్‌ఎ్‌సఎల్పీ, బీజేఎల్పీ ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. బడ్జెట్‌, పద్దులపై చర్చించేందుకు కనీసం 15 రోజులైనా అసెంబ్లీ నిర్వహించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

అయితే బీఆర్‌ఎస్‌ హయాంలో బడ్జెట్‌ సమావేశాలను మూడు రోజుల్లోనే ముగించిన సందర్భాలు కూడా ఉన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. నిబంధనల ప్రకారం ఈ నెల 31 కల్లా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకోవాల్సి ఉందని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు.

కాగా, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు అసెంబ్లీలో ఇచ్చిన చాంబర్‌.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సౌకర్యంగా లేదని హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ఆయనకు మరో చాంబర్‌ను కేటాయించాలని కోరారు. అయితే ప్రస్తుతం చాంబర్లేవీ ఖాళీగా లేవని, ప్రతిపాదనను పరిశీలిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

Updated Date - Jul 24 , 2024 | 03:51 AM