Share News

Tirumala issue: తిరుమల లడ్డూ వివాదం- సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రుల రియాక్షన్ ఇదే..

ABN , Publish Date - Oct 04 , 2024 | 03:20 PM

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు అన్నారు.

Tirumala issue: తిరుమల లడ్డూ వివాదం- సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రుల రియాక్షన్ ఇదే..

అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీకి చెందిన పలువురు మంత్రులు స్పందించారు. ఈ అంశంలో సుప్రీం ఇచ్చిన తీర్పును స్వగతిస్తున్నట్లు మంత్రులు వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర చెప్పారు. సుప్రీం తీర్పు ప్రకారం లడ్డూ కల్తీపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చనున్నట్లు మంత్రులు తెలిపారు.


తిరుమల లడ్డూ వివాదంపై ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. శ్రీవారి లడ్డూ అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన ముఖ్యమైన అంశమని అనిత అన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని చెప్పుకొచ్చారు. సిట్ ఏర్పాటుతో స్వామివారి భక్తులు, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని ఆమె అన్నారు. తప్పు చేయనివారు భయపడరని, విజిలెన్స్ ఎంక్వైరీ అంటే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సిట్ ద్వారా త్వరలో నిజానిజాలు బయటపడతాయని, స్వామివారికి అపచారం చేసిన వారు ఎవరైనా సరే జైలుకు వెళ్లడం ఖాయమని హోంమంత్రి అనిత అన్నారు.


సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు అన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. వినాయకుడి గుడి వద్ద నంచి క్యూ లైన్‌లో నడిచి తాను కొండపైకి చేరినట్లు మంత్రి చెప్పారు. గత ఐదేళ్లపాటు మహోత్సవాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రవీంద్ర మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం దేవాలయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. లక్షల మంది భక్తులు వస్తున్నా ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మవారి దర్శనం జరుగుతోందని మంత్రి చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.


మరోవైపు నెల్లూరు నగర కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నగరంలో అపరిష్కృత సమస్యలపై దృష్టి సారించాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "నెల్లూరు నగరంలో సమస్యలున్న ప్రాంతాలను ఒక్కొకటిగా పర్యటిస్తున్నా. నగరంలో కొన్ని రోడ్ల మరమ్మత్తులకు పది రోజుల్లో టెండర్లు పిలిచి పనులకు ఆదేశిస్తాం. కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య ఆరు నెలల్లో పరిష్కరించాలని ఆదేశించా. పార్కులు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. వాటిని పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. నగరంలో గ్రీనరి డెవలప్మెంట్ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాళ్లను స్వాగతిస్తున్నాం. నెల్లూరులో ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ సమస్య ఉంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. లడ్డూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందు వల్ల కూటమి నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేయెుద్దని కోరుతున్నా" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పీహెచ్‌డీ చేస్తూ చికెన్ పకోడీ వ్యాపారం.. వైరల్ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..

YV Subbareddy: కల్తీ జరగలేదు.. న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 04 , 2024 | 03:37 PM