TDP: ప్రకటనల పేరుతో సాక్షి పేపర్, ఐ ప్యాక్లకు కోట్లు కట్టబెట్టారు: విజయ్ కుమార్
ABN , Publish Date - Jun 24 , 2024 | 07:38 PM
గడిచిన ఐదేళ్లలో వ్యవస్థలను, కార్పొరేషన్లను సర్వనాశనం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ (Neelayapalem Vijay Kumar) అన్నారు. వైసీపీ తొత్తులకు ఉద్యోగాల కోసం ఏకంగా కార్పొరేషన్ పెట్టి దోచిపెట్టారని మండిపడ్డారు.
![TDP: ప్రకటనల పేరుతో సాక్షి పేపర్, ఐ ప్యాక్లకు కోట్లు కట్టబెట్టారు: విజయ్ కుమార్](https://media.andhrajyothy.com/media/2024/20240615/Neelayapalem_Vijay_Kumar_40ca974b80_v_jpg.webp)
అమరావతి: గడిచిన ఐదేళ్లలో వ్యవస్థలను, కార్పొరేషన్లను సర్వనాశనం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ (Neelayapalem Vijay Kumar) అన్నారు. వైసీపీ తొత్తులకు ఉద్యోగాల కోసం ఏకంగా కార్పొరేషన్ పెట్టి దోచిపెట్టారని మండిపడ్డారు. కంటెంట్ కార్పొరేషన్ గా ఉన్నదాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరు మార్చి దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఒక చిన్న కార్పొరేషన్ లో 129 మంది ఉద్యోగులను తీసుకొని లక్షల్లో జీతాలు చెల్లించారని ఆరోపించారు. సగంమంది ఆఫీసుకు రాకుండా జీతాలు చెల్లించారని చెప్పారు.
చైర్మన్, వైస్ చైర్మన్ల ఇళ్లలో ట్యూషన్ చెబుతున్న టీచర్లకు కార్పొరేషన్ నుంచి జీతాలు చెల్లించారన్నారు. ప్రకటనల పేరుతో సాక్షి పేపర్కు, ఐ ప్యాక్కు కోట్లు కట్టబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి కొన్ని వేల కోట్లు దోచిపెట్టారని ఆరోపణలు చేశారు. దోపిడీపై ప్రశ్నించిన తనకు నోటిసులు ఇచ్చిన చిన్న వాసుదేవరెడ్డి నేడు ఎక్కడికి పారిపోయారని విమర్శలు గుప్పించారు. ఈ అక్రమ దోపిడీపై చంద్రబాబు ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విజయ్ కుమార్ కోరారు.