Share News

CM Revanth Reddy: సరితూగే అభ్యర్థుల్లేకే!

ABN , Publish Date - Jul 05 , 2024 | 02:53 AM

బీజేపీ అభ్యర్థులకు సరితూగే అభ్యర్థులు లేకపోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు కొన్నిచోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తన నేతృత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులు లోక్‌సభ ఎన్నికలలో శాయశక్తులా పోరాడాయని చెప్పారు.

CM Revanth Reddy: సరితూగే అభ్యర్థుల్లేకే!

  • కొన్నిచోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు.. కాంగ్రెస్‌ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు

  • ఓడి మళ్లీ పోటీ చేయడం బీజేపీకి కలిసొచ్చింది.. రాజధానిపై నా మార్కు మూసీ ప్రాజెక్టు

  • మొదలెట్టిన మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నాలుగు ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం

  • ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించినోళ్లు అనుభవిస్తారు

  • ఈవీఎంలతో అక్రమాలకు అవకాశముంది

  • రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్‌లా రాజీపడను

  • ఏపీతో పంపకాల్లో చట్టప్రకారమే వ్యవహరిస్తా

  • ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్‌ ఇష్టాగోష్ఠి

న్యూఢిల్లీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): బీజేపీ అభ్యర్థులకు సరితూగే అభ్యర్థులు లేకపోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు కొన్నిచోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తన నేతృత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులు లోక్‌సభ ఎన్నికలలో శాయశక్తులా పోరాడాయని చెప్పారు. తనతో పాటు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, వివేక్‌, దామోదర రాజనర్సింహ లాంటి కాంగ్రెస్‌ దిగ్గజ నేతలంతా శాసనసభకు ఎన్నిక కావడంతో లోక్‌సభ ఎన్నికలలో పలుచోట్ల బీజేపీ అభ్యర్థులకు సరితూగే నేతలు లేకపోయారని అన్నారు. బీజేపీ తరపున పోటీ చేసిన ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్‌, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌లు అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయి, తిరిగి లోక్‌సభకు పోటీ చేయడం వల్ల వారి పర్సనాలిటీలతో పోటీపడే విషయంలో అక్కడి తమ అభ్యర్థులు కాస్త వెనుకబడ్డారన్నారు.


ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుగ్లక్‌ రోడ్డులోని తన అధికార నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని, ఆ విషయంలో తాను జోక్యం చేసుకోవట్లేదని చెప్పారు. ఒక మహిళాఐఏఎస్‌ అధికారిఫోన్‌ను కూడా ట్యాపింగ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయని ప్రస్తావించారు. కత్తి పట్టినోడు కత్తికి బలైతాడు అన్నట్లు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినోళ్లు దానికి బలి కావడం ఖాయమని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ గురించి విలేకరులు ప్రశ్నించగా, అంతా మీడియాయే మాట్లాడిందని వ్యాఖ్యానించారు.


ఈవీంలతో అక్రమాలకు అవకాశం

ఈవీఎంలతో ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ అభిప్రాయపడ్డారు. పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన ఈవీఎంలకు అదనంగా మరో 15 శాతం ఈవీఎంలు ప్రతీ నియోజకవర్గానికి కేటాయించి, ఈవీఎంల పంపిణీ కేంద్రానికి తరలిస్తారని చెప్పారు. ఈవీఎంలను పోలింగ్‌ బూత్‌లకు తరలించేటప్పుడు ఆ 15 శాతం అదనపు ఈవీఎంలు పంపిణీ కేంద్రంలోనే ఉండి పోతాయన్నారు. పోలింగ్‌ పూర్తయ్యాక అన్ని ఈవీఎంలు తిరిగి పంపిణీ కేంద్రానికే వస్తాయన్నారు. ఇలా పోలింగ్‌లో వాడిన ఈవీఎంలను, వాడని ఈవీఎంలను ఒకచోట చేర్చినపుడు అక్రమాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వం రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఈవీఎంల అక్రమాలపై పోరాటం చేశామని రేవంత్‌ గుర్తు చేసుకున్నారు. ఫలితంగానే వీవీప్యాట్ల ద్వారా 5 శాతం ఓట్లు లెక్కించాలనే నిబంధనలు వచ్చాయని గుర్తు చేశారు. ఈవీఎంలు అన్నింటినీ దుర్వినియోగం చేసే అవకాశాలు లేవని, పది వేల ఓట్ల తేడాతో ఓడిపోతామని అంచనా ఉన్న స్థానాలలో మాత్రమే ఫలితాలను తారుమారు చేసే అవకాశాలున్నాయని రేవంత్‌రెడ్డి చెప్పారు.


నా మార్కు మూసీ ప్రాజెక్టు

మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు తన పాలనలో చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని రేవంత్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల మేరకు మూసీ నదిని, దాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా తన ముద్ర వేస్తానని చెప్పారు. మూసీతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టును తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. హైకోర్టు నిర్మాణాన్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తామని ప్రకటించారు. మూసీ నదిలోకి గండిపేట ద్వారా గోదావరి నీటిని తరలిస్తామని, త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. గండిపేట నుంచి రింగ్‌ రోడ్డు వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చును అంచనా వేసే బాధ్యతను రెండు అంతర్జాతీయ సంస్థలకు అప్పగించామని చెప్పారు. ప్రాజెక్టు పొడవునా రోడ్డు, మెట్రోలు ఉంటాయని తెలిపారు. నగరంలోని మురికి నీటిని ఎస్టీపీల్లో శుద్ధి చేసిన తర్వాతే మూసీలోకి వదులుతామని చెప్పారు. నిర్మాణం ప్రారంభించిన మూడు ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టును 12-15 కిలోమీటర్ల పొడవు ఉండే 4 క్లస్టర్లుగా విభజించి, నాలుగు పెద్ద ఏజెన్సీలకు బాధ్యత అప్పగిస్తామన్నారు. ప్రాజెక్టులో భాగంగా 10,500 అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సి వస్తుందని అంచనా వేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించడం, ల్యాండ్‌ పూలింగ్‌ చేపట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, టీడీఆర్‌ ఇవ్వడం, నష్టపరిహారం... ఇలా నాలుగు పద్ధతుల్లో పునరావాసం ఉంటుందని చెప్పారు. ఆగస్టులో జపాన్‌, కొరియాలలో నదుల అభివృద్ధిని పరిశీలిస్తామని వెల్లడించారు.


ఫిరాయింపుల తీర్పు నా పోరాట ఫలితమే

ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారానికి సంబంధించి గతంలో తాను టీడీపీలో ఉండగా న్యాయస్థానాలలో కొట్లాడానని రేవంత్‌ గుర్తు చేసుకున్నారు. 12 వారాలలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఇచ్చిన తీర్పు తన పోరాట ఫలితమేనన్నారు. పెగాసెస్‌ ద్వారా ఫోన్ల ట్యాపింగ్‌ జరుగుతున్న వ్యవహారాన్ని వ్యవహారాన్ని దేశంలోనే మొదట వెలుగులోకి తెచ్చింది తానేనని రేవంత్‌ గుర్తు చేసుకున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో లోక్‌సభలో పెగాసెస్‌ అంశంపై మొదట తానే ప్రశ్నించానని తెలిపారు.


ఫిరాయింపుల తీర్పు నా పోరాట ఫలితమే

ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారానికి సంబంధించి గతంలో తాను టీడీపీలో ఉండగా న్యాయస్థానాలలో కొట్లాడానని రేవంత్‌ గుర్తు చేసుకున్నారు. 12 వారాలలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఇచ్చిన తీర్పు తన పోరాట ఫలితమేనన్నారు. పెగాసెస్‌ ద్వారా ఫోన్ల ట్యాపింగ్‌ జరుగుతున్న వ్యవహారాన్ని వ్యవహారాన్ని దేశంలోనే మొదట వెలుగులోకి తెచ్చింది తానేనని రేవంత్‌ గుర్తు చేసుకున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో లోక్‌సభలో పెగాసెస్‌ అంశంపై మొదట తానే ప్రశ్నించానని తెలిపారు.


గ్రూప్‌ 1లో 1:50 మీరు పెట్టిందే

గ్రూప్‌ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేసీఆర్‌ ప్రభుత్వం 1:50 నిష్పత్తిలో చేపట్టాలని నోటిఫికేషన్‌ ఇచ్చిందని, దాన్నే తాము అమలు చేస్తున్నామని రేవంత్‌ తెలిపారు. ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేసే విషయంలో తమ ప్రభుత్వం సీరియ్‌సగా ఉందని గ్రహించిన ప్రతిపక్షాలు ఇప్పుడు అడ్డుపుల్లలు వేసేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయని ఆరోపించారు. తాను పలుమార్లు ఢిల్లీ వచ్చిన విషయాన్ని ప్రచారం చేస్తున్న విపక్షాలు రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చిన ప్రతిసారీ కేంద్రమంత్రులను కలుస్తున్న విషయాన్ని మాత్రం చెప్పట్లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేళ్లు ఉండడం గ్యారెంటీ అని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేదు

విభజన సమస్యల పరిష్కారంలో చట్ట ప్రకారమే నడుచుకుంటామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ రాజీ పడ్డాడు కాబట్టే ఏడు మండలాలను ఏపీకి వదులుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ సీఎం అయ్యాకే కేంద్రంఏడు మండలాలపై ఆర్డినెన్స్‌ ఇచ్చి, తర్వాత బిల్లు ఆమోదించిందని ప్రస్తావించారు. 25 లక్షల ఇళ్ల కోసం కోసం కేంద్రాన్ని అభ్యర్థించడం గురించి మాట్లాడుతూ, కేసీఆర్‌ శ్రీమంతుడు కాబట్టే ఇవ్వన్నీ ఏమీ వద్దని వదులుకున్నారని, తాము పేదవాళ్లం అయినందున కేంద్రాన్ని అడుగుతున్నామని వ్యంగ్యంగా అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులను కూడా కేసీఆర్‌ తీసుకోలేదని ప్రస్తావించారు. కృష్ణా జలాలలో 512 టీఎంసీలు ఏపీకి వదులుకున్నారని ఆరోపించారు.


నేను కాదు... మోదీయే

ప్రధాని మోదీని కలిసినపుడు చేతులు పట్టుకోవడంపై విలేకరులు ప్రశ్నించగా, చేతులు ఆయన పట్టుకున్నారని, తానేం పట్టుకోలేదని నవ్వుతూ బదులిచ్చారు. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ వ్యవహార శైలిలో ఏమైనా మార్పు గమనించారా? అని అడగ్గా, ఆయన నరేంద్ర మోదీ కదా ఏం మారుతారు? అని ప్రశ్నించారు. పాతబస్తీ కరెంటు బిల్లులను వసూలు చేసే బాధ్యతనుఅదానీకి బదులుగా బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తీసుకుంటే తనకు అభ్యంతరం లేదన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 02:53 AM