Share News

Minister Sridhar Babu: తిరుమల లడ్డూ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే..?

ABN , Publish Date - Sep 22 , 2024 | 09:46 PM

తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ ఎక్కడ కాకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పుణ్యక్షేత్రాల్లో కల్తీ అసలే కాకూడదని చెప్పారు. పుణ్య క్షేత్రాల్లో రాజకీయాలకు తావు లేదని చెప్పారు. లడ్డూ విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Minister Sridhar Babu: తిరుమల లడ్డూ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే..?
Minister Sridhar Babu

హైదరాబాద్: తిరుపతి లడ్డూ వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ గొంతెత్తున్నారు. ఈ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ ఎక్కడ కాకూడదని అన్నారు. పుణ్య క్షేత్రాల్లో కల్తీ అసలే కాకూడదని చెప్పారు.


పుణ్యక్షేత్రాల్లో రాజకీయాలకు తావు లేదని చెప్పారు. లడ్డూ విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ ట్రైడెంట్‌లో ఇవాళ(ఆదివారం) సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు స్వాగతోపన్యాసం చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ... అరికెపూడి గాంధీ ఎపిసోడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


తన నియోజకవర్గానికి సీఎం వచ్చినందుకే అరికెపూడి గాంధీ వచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవడానికి అరికెపూడీ గాంధీ వచ్చారని అన్నారు. సీఎల్పీ సమావేశానికి గాంధీ రాలేదని స్పష్టం చేశారు. సిద్దిపేటకు ముఖ్యమంత్రి వస్తే మాజీ మంత్రి హరీష్‌రావు వెళ్లే ప్రయత్నం చేయరా? అని ప్రశ్నించారు.సీఎల్పీ తరఫున మహేష్ గౌడ్‌కి శుభాకాంక్షలు తెలిపామని అన్నారు. పార్టీ, ప్రభుత్వం ఎలా సమన్వయంతో వెళ్లాలో ఈ సమావేశంలో చర్చించుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


చాలామంది సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారని అన్నారు. మంత్రులు కూడా పార్టీ విషయాలపై మాట్లాడారని అన్నారు. పార్టీ కార్యాచరణపై చర్చించామని చెప్పారు. పార్టీ ముఖ్యమని, పార్టీని బలపరచే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని అన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోబెల్స్ ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ నెంబర్ వన్ అని నిరూపించుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.


ఎనిమిది నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, తమ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీసీల గురించి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన చేశారని అన్నారు. రాహుల్ నిర్ణయాన్ని తాము తప్పకుండా పాటిస్తామని చెప్పారు. బీసీ కులగణన కోసమే బీసీ కమిషన్ వేశామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Updated Date - Sep 22 , 2024 | 09:56 PM