Share News

Harish Rao: ఎంతవరకైనా తెగించి కొట్లాడుతాం.. రేవంత్ ప్రభుత్వానికి హరీశ్‌‌రావు డెడ్‌లైన్

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:59 PM

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున రేవంత్ ప్రభుత్వాన్ని(Revanth Govt) నిలదీస్తామని, అసెంబ్లీని స్తంభింపజేస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish Rao) అన్నారు.

Harish Rao: ఎంతవరకైనా తెగించి కొట్లాడుతాం..  రేవంత్ ప్రభుత్వానికి  హరీశ్‌‌రావు డెడ్‌లైన్
Harish Rao

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున రేవంత్ ప్రభుత్వాన్ని(Revanth Govt) నిలదీస్తామని, అసెంబ్లీని స్తంభింపజేస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గ్రూప్స్, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను హరీష్ రావు ఈరోజు (ఆదివారం) పరామర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలని.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్‌తో మాట్లాడాలని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు.


ప్రభుత్వంపై తెగించి కొట్లాడుతాం..

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని.. ఎంతవరకైనా తెగించి కొట్లాడుతామని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. మోతీలాల్ నాయక్ దీక్ష విరమించాలని మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశారు. వారితో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. మోతీలాల్‌కు ఏం జరగక ముందే ప్రభుత్వం తక్షణ స్పందించాలని.. అతని ఆరోగ్యం పట్ల ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని వివరించారు. టీజేఎస్, ప్రొ. కోదండరాం పిల్లల హక్కుల పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు. హామీలు అమలు చేసే విధంగా ముందుకు రావాలని హరీశ్‌రావు చెప్పారు.


మోతీలాల్ నాయక్ దీక్ష విరమించాలి..

‘‘మోతీలాల్ నాయక్ ఏడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం దురదృష్టకరం. మోతీలాల్ దీక్ష విరమించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కలిసి కోరాం. ఇది నా ఒక్కడి పోరాటం కాదు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగుల పక్షాన పోరాటం అన్నారు. ప్రభుత్వం దిగివచ్చే దాకా దీక్ష విరమించనని చెప్పారు. పదేపదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. అందరం కలిసి పోరాటం చేద్దాం, మేము మీ వెంట ఉన్నాం, ప్రాణం ముఖ్యం, తండ్రి లేని వాడివని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను వాడుకొని వదిలిపెట్టింది. ఎన్నికలు అయిపోయాక నిరుద్యోగుల గుండెల మీద తన్నుతోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఓడదాటే దాకా ఓడ మలన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉంది. ఆనాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరాం, రియాజ్, బలమూరి వెంకట్, మురళి, రేవంత్ రెడ్డి అశోక్ నగర్‌లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేశారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్‌కు తీసుకొచ్చి హామీలు చేయించారు’’ అని హరీశ్‌రావు గుర్తుచేశారు.


రాహుల్, రేవంత్‌కు నిరుద్యోగుల బాధలు కనపడట్లేదా..?

‘‘మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యోగులకు రాలేదు. ఎందుకు మీ గొంతులు మూగబోయాయి. రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏడు నెలలు పూర్తయింది ఎందుకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. రాహుల్ గాంధీకి నిరుద్యోగుల బాధలు కనపడటం లేదా..? వినపడటం లేదా. ..?నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే పోరాటాలు చేస్తుంటే ఎందుకు రాహుల్ గాంధీ పట్టించుకోరు. రేవంత్ రెడ్డికి చెప్పాలని ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ నిరసన తెలియజేస్తే పట్టించుకోరు. అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రాహుల్ గాంధీ చొరవ చూపాలి. రేవంత్ రెడ్డికి డైరెక్షన్ ఇవ్వాలి. నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లోకి వెళ్లి ఓట్లు వేయాలని అడిగారు. చిటికెలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా అన్నారు. 7 నెలలు గడిచినా చేయట్లేదు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు ఏమయ్యాయి...? అసెంబ్లీలో భట్టి విక్రమార్క 1:100 ఎలిజిబిలిటీ గ్రూప్ వన్ మెయిన్స్‌కు ఇవ్వాలి. ప్రొఫెసర్ కోదండరాం నిరుద్యోగులను రెచ్చగొట్టారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు. ఉమ్మడి ఏపీలో, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో పెంచడం సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి, కోదండరామిరెడ్డి సమాధానం చెప్పాలి. ప్రజా పాలనలో నిరుద్యోగులు దరఖాస్తులు ఇస్తూ చిన్నారెడ్డి కాళ్ల మీద పడితే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులు, యువకులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇదేనా ప్రజాపాలన.? విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.


నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ లేఖ

1. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా గ్రూప్ వన్ మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:50 నుంచి 1:100 పెంచాలి. ఒక్కో పోస్టుకు మెయిన్స్‌కి 100 మంది పోటీ పడే అవకాశం కల్పించాలి.

2.గ్రూప్-2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్-3కి మూడు వేల ఉద్యోగాలు కలుపుతామన్న మాట నిలబెట్టుకోవాలి. పరీక్షకు, పరీక్షకు మధ్య 2నెలల గ్యాప్ ఉండేలా చూడాలి.

3.ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలి. ఆరునెలలు గడిచింది, మరో ఆరు నెలల సమయమే ఉందన్న విషయం గుర్తించి ఆ దిశగా చర్యలు ప్రారంభించాలి.

4.ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులను గుర్తించి, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి.


5. అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్‌లోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పిన హామీ నిలబెట్టుకోవాలి. 11వేల పోస్టులు కాదు, 25వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.

6.గురుకుల టీచర్ పోస్టులు బ్యాక్ లాగ్ కాకుండా, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలి.

7, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీ.వో నెంబర్ 46 రద్దు చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చాక వారిని నట్టేట ముంచి జీ.వో 46 ప్రకారమే నియామక ప్రక్రియ పూర్తి చేశారు. ప్రభుత్వం వెంటనే జీ.వో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలి.

8, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నెలకు రూ. 4000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఉన్న బకాయి మొత్తం సహా నిరుద్యోగ భృతిని నెల నెలా చెల్లించాలి. లేకుంటే నిరుద్యోగుల తరఫున మరో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుంది.

Updated Date - Jun 30 , 2024 | 06:14 PM