KTR: తెలంగాణలో నయా కుంభకోణం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:16 PM
KTR: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువును తాకట్టు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. తప్పు చేస్తోన్న పోలీస్ అధికారులు ఊచలు లెక్కపెట్టక తప్పదని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన తమకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండాలని తాము కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. రేవంత్ రెడ్డే ఐదేళ్లు సీఎంగా ఉండాలని... అప్పుడే కాంగ్రెస్ ఇరవై ఏళ్ల పాటు అధికారంలోకి రాదని విమర్శించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే కాంగ్రెస్కు బుద్ధి చెబుతారని అన్నారు. తమ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి చెప్పింది అక్షర సత్యమని అన్నారు. ప్రజలు తమ దగ్గరకు వచ్చి ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారని మాత్రమే ప్రభాకర్రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాలనే ప్రజలే కోరుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.
పార్టీ ఫిరాయింపులను మెదలు పెట్టిందే కాంగ్రెస్ అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆయారాం గయారాం సంస్కృతిని ఇందిరాగాంధీ తీసుకువచ్చారని గుర్తుచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో వారికే తెలియటం లేదని చెప్పారు. ఏ పార్టీలో ఉన్నారని అడిగితే .. తనకేం తెలుసని కడియం శ్రీహరి అంటున్నారని.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో అంత అయోమయంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు గుప్పించారు. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు డైరెక్షన్స్ను స్వాగతిస్తున్నామని అన్నారు. వందల ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరణ చేస్తారో రేవంత్ ప్రభుత్వాన్ని చెప్పాలనటం సంతోషకరమని అన్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత ఇంకో ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేసి పోయేవారని.. రేవంత్ రెడ్డి కాబట్టి దులుపుకుని పోతున్నారని విమర్శించారు. ఇది హెచ్సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్ల విజయమని మాజీ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు.
హెచ్సీయూ భూముల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. లేకపోతే మోదీకి కూడా కాంగ్రెస్ కుంభకోణంలో వాటా ఉందని నమ్మాల్సి వస్తుందని తెలిపారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు జడ్డితో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ డైలాగులు కొడితే సరిపోదని... విచారణ జరిపించాలని కోరారు మోదీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. కేంద్రం తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని అన్నారు. తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ వసూళ్లు చేస్తున్నారని ఏడాది క్రితం మోదీ అన్నారని గుర్తుచేశారు. ఏడాదికి ఒకసారి మాత్రమే కాంగ్రెస్ సర్కార్పై మోదీ మాట్లాడుతున్నారని అన్నారు. ప్రవచనాలు చెబుతున్న మోదీ.. రేవంత్ ప్రభుత్వంపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
రూ. 10వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే విచారణ జరపాల్సిందేనని మాజీ మంత్రి కేటీఆర్ పట్టుపట్టారు. హెచ్సీయూలో ఏ సమస్య ఉన్నా వస్తానని రాహుల్ గాంధీ గతంలో చెప్పారని.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. చెరువును తాకట్టు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఆరోపణలు చేశారు. ఏఐ వీడియోలు లేవన్న జస్టిస్ గవాత్ మీద కూడా రేవంత్ రెడ్డి కేసులు పెట్టగలరని అన్నారు. ఇప్పుడు ఐఏఎస్, ఫారెస్ట్ అధికారుల వంతు అయిందని.. ఆ తర్వాత పోలీస్ అధికారుల వంతు వస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి సొంత సైన్యం మాదిరి పనిచేస్తోన్న కొంతమంది పోలీస్ అధికారులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. తప్పు చేస్తోన్న పోలీస్ అధికారులు ఊచలు లెక్కపెట్టక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో అధికారులను తాను బలిపశువులను చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో అధికారులు బలిపశువులు అవుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
National Herald Case: రాజకీయ ఈడీ కేసు
CM Revanth Reddy: జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్
Kanch Gachibowli: కంచగచ్చిబౌలి భూములకు అటవీ లక్షణాలు!
Read Latest Telangana News And Telugu News