Share News

KTR: ఢిల్లీ వెళ్లడం తప్పా.. తెలంగాణకు ఏం చేశారు.. రేవంత్‌పై కేటీఆర్ విసుర్లు

ABN , Publish Date - Feb 25 , 2025 | 07:05 PM

KTR: కాంగ్రెస్, బీజేపీ నేతలు కాలేశ్వరంపై దుష్ప్రచారం చేసి తెలంగాణ ప్రజల మనసుల్లో విష బీజాలు నాటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. తెలంగాణలో రాహుల్, రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ ఆరోపించినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు బీజేపీ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

  KTR: ఢిల్లీ వెళ్లడం తప్పా.. తెలంగాణకు ఏం చేశారు.. రేవంత్‌పై కేటీఆర్ విసుర్లు
KTR

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు 36వ సారి కూడా రేవంత్‌రెడ్డి ఢిల్లీ పోయారని విమర్శించారు. ఎన్నిసార్లు ఢిల్లీ పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. హోంశాఖ ,విద్యాశాఖ, సంక్షేమ శాఖకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి.. తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపి వేస్తాడా అని ప్రశ్నించారు.రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ యాదికొస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ వెళ్లడం తప్పా తెలంగాణకు రేవంత్ ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదంపై,అందుకు బాధ్యులైన వారిపై విచారణ చేపట్టాలని కోరారు. ఇవాళ(మంగళవారం) కేటీఆర్ ఒక ప్రతిక ప్రకటన విడుదల చేశారు.


ALSO READ: Bandi Sanjay: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ను ఆ దేశంతో పోల్చిన కేంద్రమంత్రి..

ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు. తాజాగా ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగిందని చెప్పారు. ఇంతకుముందు సుంకిశాలా, పెద్దవాగు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా రేవంత్ ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదని, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా, చాలా అంశాలపై న్యాయ కమిషన్‌ల ఏర్పాటు కోసం డిమాండ్ చేశారని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక న్యాయ కమిషన్‌లు ఏర్పాటు చేశారని తెలిపారు. తాజా ప్రమాదాలపై న్యాయ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆర్మీ, ఇతర సంస్థల సహాయంతో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా ప్రభుత్వం మరింతగా కృషి చేయాలని కేటీఆర్ కోరారు.


రోమ్ చక్రవర్తి నీరోను తలపిస్తున్న రేవంత్..

‘‘అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో స్వల్ప కాలంలోనే చేరుతున్నారంటే ఆ పార్టీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతం ఇది. ఒక్క స్టేషన్ ఘన్‌పూర్ మాత్రమే కాదు సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. కేవలం 48 గంటల్లోనే రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు . ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకొని ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన ఫరక్ లేదని రేవంత్ చిద్విలాసంగా మాట్లాడుతున్నాడు.. ఒకప్పటి రోమ్ చక్రవర్తి నీరో లెక్కనే రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తాను ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి కలలో కూడా ఊహించుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజుకు ఒక రైతు చొప్పున ఇప్పటివరకు 450 మంది రైతులు చనిపోయారు. రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమేనని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లోనే ప్రకటించడం కేసీఆర్ పాలన దక్షత, రైతులపై ప్రేమకు నిదర్శనం. గోదావరి నదిని 80 మీటర్ల నుంచి 618 మీటర్ల పైకి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్‌ను కేసీఆర్ నింపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాలేశ్వరంను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజ్‌‌లలో 340 పిల్లర్లు ఉన్నాయి. అందులోని ఒక పిల్లర్ పర్రే వస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు నానా యాగి చేశారు . కాంగ్రెస్, బీజేపీ నేతలు కాలేశ్వరంపై దుష్ప్రచారం చేసి తెలంగాణ ప్రజల మనసుల్లో విష బీజాలు నాటారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయినా, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోతే, ఖమ్మం పెద్దవాగు బ్రిడ్జి కొట్టుకుపోతే ఏ బీజేపీ నాయకుడు మాట్లాడటం లేదు. ఇవాళ రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. కాలేశ్వరం పిల్లర్ పర్రె బాయడంపై హడావుడి చేసిన ఎన్డీఎస్ఏ ఈ ప్రమాదాల విషయంలో మౌనంగా ఎందుకు ఉంది. సుంకిశాల ప్రమాదంపై వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే దేశ భద్రతకు సంబంధించిందని రేవంత్ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో రాహుల్, రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు బీజేపీ ప్రభుత్వం తీసుకోలేదు. రూ. 2కోట్ల లాభం మాత్రమే అర్జించిన రేవంత్ బామ్మర్దికి సంబంధించిన శోధా కంపెనీకి రూ.1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్‌ను రేవంత్ రెడ్డి అక్రమంగా కట్టబెట్టారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఆరు నెలలు అవుతున్న ఇప్పటిదాకా చర్యలు లేవు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడి దాడులు జరిగిన ఇప్పటిదాకా అసలు ఏం జరిగిందో ఈడీ బయట పెట్టడం లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్‌ను విమర్శించే రేవంత్ రెడ్డి బీజేపీని ఒక్క మాట కూడా అనడు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఉన్నన్ని రోజులు తమ పప్పులు ఉడకవని కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయి. లగచర్లలో తన అల్లుడి ఫ్యాక్టరీకి భూములు ఇవ్వనందుకే అక్కడి రైతులపై రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు’’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..


కొడంగల్‌లో రేవంత్‌పై తిరుగుబాటు..

‘‘లగచర్ల లంబాడ సోదరుల కోసం ఢిల్లీ వరకు వెళ్లి కొట్లాడి వాళ్లకు బెయిల్ ఇప్పించినం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడతామంటూ కొడంగల్ నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైంది. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలి. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనందుకు బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డిని చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ విలువ అర్థమవుతోంది. రైతుల ఖాతాల్లో టకీ టకీమని పైసలు పడతల్లేవు కానీ ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీకి మాత్రం టకీ టకీమని రేవంత్ రెడ్డి పైసలు పంపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారు. పది నెలల కేసీఆర్ పాలనలో మేము చేసిన అప్పు సంవత్సరానికి రూ.41 వేల కోట్లు. ఆ అప్పులతో సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని సంస్కరించాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలేశ్వరంను కట్టాం. గుక్కెడు మంచినీళ్ల కోసం కిలోమీటర్లు నడిచే దురావస్థ నుంచి తెలంగాణ ఆడబిడ్డలను కాపాడేందుకు మిషన్ భగీరథను ప్రారంభించాం. ఇంటింటికీ నల్లా పెట్టి మంచినీళ్లు ఇచ్చాం. రైతుబంధు రూపంలో రూ.73 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాలో సమయానికి వేశాం. రూ.28 వేల కోట్లతో రెండుసార్లు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టాం. వరంగల్లో తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్‌ని కట్టాం. ఘన్‌పూర్‌లో కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌ను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతదేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 200 గురుకుల పాఠశాలలను 1000కి పెంచింది. సంవత్సరానికి రూ. 40 వేల కోట్ల అప్పుచేసి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఇన్ని కార్యక్రమాలను చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లో రూ.1,50,000 కోట్ల అప్పు చేసింది. ఈ అప్పుతో ఒక్క ప్రాజెక్ట్ అయినా రేవంత్ రెడ్డి ప్రారంభించిండా. కొత్తగా ఒక్క ఇటుకైనా పేర్చిండా గోడైన కట్టిండా. కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధుకు రామ్ రామ్ అయితదని కేసీఆర్ ముందే చెప్పారు. ఈ లక్షన్నర కోట్ల అప్పుతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. రాజయ్య నేతృత్వంలో స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా పనిచేస్తుంది. సంస్థాగతంగా పార్టీని అద్భుతంగా నిర్మించుకుందాం. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడేది కేసీఆర్, గులాబీ సైన్యమే. పార్టీ రజతోత్సవ సంబురాలను ఘనంగా జరుపుకుందాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Kishan Reddy: ఆ విషయం నిరూపించాలి.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి మాస్ సవాల్

CM Revanth Reddy: తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి..

Seethakka criticizes Bandi Sanjay: బండి సంజయ్‌ వ్యాఖ్యలు.. సీతక్క మాస్ వార్నింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 07:23 PM