Share News

MLA Pinnelli: పరారీలోనే పిన్నెల్లి తమ్ముడు.. ఇంకా అరెస్ట్ చేయలేదేం!?

ABN , Publish Date - May 30 , 2024 | 02:19 AM

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎక్కడ? పోలింగ్‌ నాడు, మర్నాడు జరిగిన హింసాకాండలో ఆయన ప్రమేయం కూడా ఉంది.

MLA Pinnelli: పరారీలోనే పిన్నెల్లి తమ్ముడు.. ఇంకా అరెస్ట్ చేయలేదేం!?

  • ఇంకా అరెస్టు చేయని పోలీసులు

  • ముందస్తు బెయిల్‌ రావడంతో బయటికొచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

  • మరి వెంకట్రామిరెడ్డి సంగతేంటి?

  • 14 నుంచి ఆచూకీ లేని వైనం

  • ఆయనపై హత్యాయత్నం సహా పలు కేసులు

  • పట్టించుకోని సిట్‌, ఎన్నికల కమిషన్‌

నరసరావుపేట, మే 29: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎక్కడ? పోలింగ్‌ నాడు, మర్నాడు జరిగిన హింసాకాండలో ఆయన ప్రమేయం కూడా ఉంది. కేసులు, అరెస్టు భయంతో అన్నతో పాటే ఈ నెల 14న మాచర్లలో గృహనిర్బంధం నుంచి పరారయ్యాడు. నాటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఆయన్ను అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం, మరో మూడు కేసుల్లో హైకోర్టు రామకృష్ణారెడ్డికి జూన్‌ 6 దాకా మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వడంతో ఆయన మంగళవారం రాత్రే నరసరావుపేట వచ్చారు. మరి షాడో ఎమ్మెల్యేగా పెత్తనం సాగించిన వెంకట్రామిరెడ్డి సంగతేంటి? ఆయన హైకోర్టును ఆశ్రయించలేదు. ముందస్తు బెయిలూ తెచ్చుకోలేదు. అలాంటప్పుడు పోలీసులు ఆయన్ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? పోలింగ్‌ రోజు, మర్నాడు ఆయన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు సాగించారు. వెల్దుర్తి మండలం కండ్లకుంటలో పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ ఏజెంట్‌గా ఉన్న నోముల మాణిక్యరావుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి, వారి అనుచరులు దాడి చేశారు. నేరుగా ఆయన ఇంటికి వెళ్లి అయన భార్యాపిల్లలను చితకబాదారు.

1PINNELLI.gif

తిరిగి పోలింగ్‌ బూత్‌కు వచ్చి పెట్రోలు బాంబులు, బరిసెలతో తనను హత్య చేయబోయారని పోలీసులకు మాణిక్యరావు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలకు సంబంధించి నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకొన్నారన్న ఆరోపణలున్నాయి. మాచర్ల పట్టణంలో కూడా వెంకట్రామిరెడ్డి బీభత్సం సృష్టించారు. పీడబ్ల్యూడీ కాలనీలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఉన్న టీడీపీ నేతల వాహనాలపై కార్లను ఎక్కించారు. అంతటితో ఆగక వారిని కార్లతో ఢీకొట్టి తొక్కించుకుంటూ వెళ్లారు. టీడీపీ నేత యెనుముల కేశవరెడ్డి ఇంటిపై దాడి చేసి ఇల్లు, కారును ధ్వంసం చేశారు. సుమారు 50 మంది టీడీపీ నేతల ఇళ్లలోకి చొరబడి బీభ్సతం సృష్టించారు. వీటిపైనా పోలీసులు దర్యాప్తు చేయలేదు. సిట్‌ కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. కారంపూడిలో వెంకట్రామిరెడ్డి వందలాది మందితో వచ్చి దాడులకు తెగబడ్డాడు. ఈ దాడిలో సీఐ నారాయణస్వామి కూడా గాయపడ్డారు. ఈ ఘటనలో వెంకట్రామిరెడ్డిపై 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

కారంపూడి మినహా మిగతా అరాచకాలపై నామమాత్రపు కేసులు పెట్టారు. కార్లతో తొక్కించడం, మారణాయుధాలతో దాడులు, అడ్డుకున్న పోలీసులపైనా దౌర్జన్యాలు చేసి గాయపరచడం హత్యాయత్నం కిందకు రాదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌ రోజు వెంకట్రామిరెడ్డి, ఆయన అనుచరులు లోయపల్లి, గొట్టిపాళ్ల, కొత్త్తపుల్లారెడ్డిగూడెం, పట్లవీడు, మరసపెంటల్లో నూ హింసాకాండ సాగించారు. సిట్‌ మాచర్ల నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో జరిగిన విధ్వంసం, హింసకు సంబంధించిన వీడియో పుటేజ్‌లను, నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఇంకా పరిశీలించకపోవడంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ కూడా తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. వెంకట్రామిరెడ్డికి ఇంకా కొందరు పోలీసు అధికారులు సహకరిస్తున్నారని.. వారు తలచుకుంటే ఆయన్ను పట్టుకోవడం పెద్ద పని కాదని అంటున్నారు.

Pinnelli-Look-Out-Notice.jpg

అనిల్‌ నివాసంలోకి పిన్నెల్లి..

హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇవ్వగానే అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి మంగళవారం రాత్రి నరసరావుపేటలో ప్రత్యక్షమైన పిన్నెల్లి.. అక్కడ ఓ హోటల్లో బసచేశారు. బుధవారం మకాం మార్చారు. వైసీపీ లోక్‌సభ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ నివాసానికి తన బస మార్చారని వైసీపీ వర్గాలు తెలిపాయి. 6వ తేదీ వరకు నరసరావుపేటలోనే ఉండాలని, రోజు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Updated Date - May 30 , 2024 | 09:16 AM