YCP VS TDP: వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:30 AM
Denduluru Politics: ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో చింతమనేని ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ వివాదంలో చింతమనేని డ్రైవర్, గన్మ్యాన్లపై అబ్బయ్యచౌదరి దాడికి పాల్పడ్డారు.ఈ దాడితో అబ్బయ్యచౌదరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏలూరు: వైసీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. జగన్ ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన నేతలు కూటమి ప్రభుత్వంలోనూ యథేఛ్చగా దాడులకు పాల్పడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు, సానుభూతిపరులపై దాడులే లక్ష్యంగా వైసీపీ రౌడీ మూక దాడులు చేసింది. తాజాగా ఏలూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసు నమోదైంది. చింతమనేని డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పీఎస్లో కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్తో పాటు పలు సెక్షన్ల కింద ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
విచక్షణ రహితంగా దాడి..
ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై హత్యాయత్నం జరిగింది. బుధవారం రాత్రి ఏలూరు సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. అయితే అదే వేడుకకు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కూడా వచ్చారు. అయితే వేడుక ముగిసిన తర్వాత చింతమనేని తన కారులో ఇంటికి బయలుదేరారు. చింతమనేని డ్రైవర్ కారు తీస్తుండగా అబ్బయ్య చౌదరి కారు అడ్డుగా పెట్టి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కారును అడ్డు తీయాలని చింతమనేని డ్రైవర్ వెళ్లి అభ్యర్థించాడు. అయితే అబ్బయ్యచౌదరి మాత్రం విచక్షణ రహితంగా డ్రైవర్, గన్మ్యాన్లపై దాడికి పాల్పడ్డాడు.
దెందులూరులో హై టెన్షన్
ఈ విషయంపై చింతమనేని గన్మ్యాన్, డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ అల్లరి మూకలు ప్రభాకర్పై దాడికి ప్రయత్నించాయని వారు వివరించారు. ఈ ఘటనతో దెందులూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలియడంతో టీడీపీ శ్రేణులు భారీగా పెదవేగి మండలం దుగ్గిరాలలోని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి వచ్చాయి. అటు వైసీపీ వర్గీయులు పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని అబ్బయ్యచౌదరి ఇంటికి భారీగా చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు చింతమనేనిపై మూకుమ్మడిగా దాడి చేయడానికి వస్తున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి పోలీసులు దిగారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి, పర్యవేక్షించారు. ఈ సంఘటనపై చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదానికి సంబంధించిన ఆధారాలను ఎస్పీకి అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Bird Flu : కోళ్లకు మరణశాసనం..!
Remand.. వంశీకి 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..
Minister Kollu Ravindra : పాపం పండింది!
Read Latest AP News and Telugu News