Share News

Tirupati Laddu: తిరుమలలో స్వతంత్ర ధార్మిక హిందూ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.. విశ్వహిందూ పరిషత్ డిమాండ్

ABN , Publish Date - Sep 21 , 2024 | 03:43 PM

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం వ్యవహారంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు స్పందించారు. దీనికి కారణమైన వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్‌పై విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tirupati Laddu: తిరుమలలో స్వతంత్ర ధార్మిక హిందూ వ్యవస్థ ఏర్పాటు చేయాలి..  విశ్వహిందూ పరిషత్ డిమాండ్

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అవకతవకల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఇవాళ(శనివారం) సంయుక్తమీడియా సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం తిరుపతి లడ్డూ ప్రసాద వివాదంపై విశ్వహిందూ పరిషత్ ఏం ప్రకటిస్తుందో అని ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


ALSO Read: Srisaila Devasthanam: వైసీపీ హయాంలో అంతా మాయ..

సనాతన ధర్మానికి నిలయంగా తిరుపతి: కసిరెడ్డి

విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి కసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అన్న భాండాగరంగా, ఆధ్యాత్మిక భాండాగరంగా సనాతన ధర్మానికి నిలయంగా తిరుపతి ఉందని చెప్పారు. తిరుపతికి వచ్చిన భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. దేవుడి దగ్గరి నుంచి వెళ్లేటప్పుడు ఎంతో నమ్మకంగా భక్తితో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారని తెలిపారు. తిరుమలలో లడ్డూ ప్రసాదం ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. అంత ప్రాముఖ్యం కలిగిన లడ్డూ ప్రసాదంపై వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి కసిరెడ్డి ఆరోపించారు.


హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి: ఏపీ విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి సత్య రవికుమార్

తిరుమలలో లడ్డూ ప్రసాదం కల్తీ జరగడంపై హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఏపీ విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి సత్య రవికుమార్ అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తీసుకుంటే అన్ని దోషాలు తొలగి శుభం కలుగుతుందని హిందువులు భావిస్తారని.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. కల్తీ లడ్డూ ప్రసాదాన్ని తిన్నవారికి ఏదైనా దోషం తగులుతుందోమోనని భక్తులు భయపడుతున్నారని అన్నారు.


లడ్డూ కల్తీ జరిగిన విషయంపై జూలై 19వ తేదీన ఓ నివేదిక వచ్చిందన్నారు. ఆ నివేదికలో కూడా జంతువుల కొవ్వు లడ్డూ ప్రసాదంలో కలిసిందని రిపోర్టులో వచ్చిందని చెప్పారు. కానీ ఇప్పటికీ తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ జరగకుండా చర్యలు తీసుకున్నామని కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా జ్యుడీషియల్ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబును కోరారు. ఈ ప్రక్రియ అత్యంత వేగంగా జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. లడ్డూ ప్రసాదం విషయంలో మత వైషమ్యాలను రెచ్చగొట్టే కుట్ర జరిగిందేమోనని విశ్వహిందూ పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తోందన్నారు. ఇది ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోనే జరిగిందా లేక ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దేవాలయాల్లో కూడా జరిగిందా అనేది కూటమి ప్రభుత్వం విచారణ చేసి అన్ని విషయాలను బయటపెట్టాలని అన్నారు.


కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి తిరుమలలో స్వతంత్ర ధార్మిక హిందూ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి ఒక సూచన చేయడాన్ని తాము ఆహ్వానిస్తున్నామని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక వ్యవస్థ అని తెలిపారు. లడ్డూ ప్రసాదం కల్తీతో ధర్మ, దైవ ద్రోహాలు జరిగాయని అన్నారు. వెంటనే తిరుపతి దేవాలయంలో సంప్రోక్షణ చేపట్టాలని కోరారు.

ఆగమశాస్త్ర ప్రకారం ఈ దోష సంప్రోక్షణ జరగాలని కోరారు. ఈ మధ్య అయోధ్యకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని పంపించిందని... ఆ ప్రసాదం కూడా ఇలాంటి ప్రసాదమే పంపించారనే అనుమానం కలుగుతోందని చెప్పారు. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న వార్త వచ్చి వారం రోజులు అవుతోందని చెప్పారు. ఈ శనివారం హిందూ సమాజం మొత్తం తమ ఇంట్లో ‘ఓం నమో వెంకటేశాయ’ అనే నామ జపంతో దైవా ఆగ్రహం కలగకుండా జపం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.


ALSO Read: Nellore: నెల్లూరు జిల్లాలో నకిలీ పోలీసులు హల్‌చల్.. పుదుచ్ఛేరి వాసులను బెదిరించి..

అన్యమతాలకు చెందిన వారు హిందూ ధార్మిక సంస్థల్లో పని చేయకుండా చూడాలి: సునీతారెడ్డి

తిరుపతికి నెయ్యిని అందజేసే సంస్థ హలాల్ సర్టిఫైడ్ సంస్థ అని విశ్వహిందూ పరిషత్ సభ్యురాలు సునీతా రెడ్డి అన్నారు. అన్ని హిందూ దేవాలయాలు, హిందూ ధార్మిక సంస్థల్లో అన్యమతాలకు సంబంధించిన వారు ఉండకుండా, ఉద్యోగాలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ కోరుతుందని అన్నారు.


హిందువుల్లో మనోవేదన : శశిధర్

గడిచినా ఐదేళ్లుగా చేపలు, వివిధ జంతువుల కొవ్వుతో తయారైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం స్వీకరించామా అనే మనోవేదన హిందువుల్లో కలుగుతోందని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ తెలిపారు. గత ఐదేళ్లుగా ఇలాంటి దారుణాలకు పాల్పడ్డ వారిని వెంటనే విచారించి ఉరి తీయాలని హెచ్చరించారు. వెంటనే తిరుపతిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు వెంటనే తీసుకొని ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.


అన్యమతస్తులు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని దెబ్బ తీయాలని చేసే కుట్రలను విశ్వహిందూ పరిషత్ ఖండిస్తోందని అన్నారు. వెంటనే హిందూ ధార్మిక వ్యవస్థల్లో, దేవాలయాల్లో ఉన్న అన్యమతస్తులను వెంటనే ఉద్యోగాల నుంచి తీసివేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోందని అన్నారు. తిరుమలలో కూడా గత ఐదు సంవత్సరాల నుంచి అన్నప్రసాదాల విషయంలో కూడా గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో వివాదాలు నెలకొన్నాయని అన్నారు.


ఈ ఘటనకు కారణమైన వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే హిందూ సమాజం చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రమాదం ఉందని తెలిపారు. లడ్డూ వ్యవహారంపై వెంటనే జ్యుడీషియల్ విచారణ జరిపించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తే వెంకటేశ్వరుని భక్తులు చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుంటారని శశిధర్ హెచ్చరించారు.


జగన్ ప్రభుత్వంలో హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు: హిందూ సంఘాలు

ఏలూరు జిల్లా: ఏలూరులో తిరుమల లడ్డూ వ్యవహారంపై హిందూ సంఘాలు ధ్వజమెత్తాయి. ఈరోజు ఏలూరులో మీడియాతో హిందూ సంఘాల ఏపీ అధ్యక్షుడు రామనపూడి శివప్రసాద్, హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లలో హిందువులు, హిందూ దేవాలయాలపై చాలా దాడులు జరిగాయని చెప్పారు. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన అవకతవకలపై తక్షణమే విచారించాలని కోరారు.


ఈఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రులను కూడా కూటమి ప్రభుత్వం విచారణ చేయాలని కోరారు జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతీ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక త్వరలోనే ప్రకటిస్తామని హిందూ సంఘాల ప్రతినిధులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Visakha: రెచ్చిపోయిన కామాంధుడు.. భీమిలిలో మరో దారుణ ఘటన..

AP Politics: జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. పవన్ సమక్షంలో చేరికకు ముహుర్తం ఫిక్స్

తాడేపల్లి టు బెంగళూరు.. షటిల్ సర్వీస్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News Click Here

Updated Date - Sep 21 , 2024 | 04:17 PM