ఘనంగా బసవేశ్వరుడి జయంతి

ABN , First Publish Date - 2022-05-04T06:15:07+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సామాజిక తత్వవేత్త బసవేశ్వరుడి జయం తిని అధికారికంగా ఘనంగా నిర్వహించారు. మంగళవా రం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌తోపా టు అధికారులు బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు.

ఘనంగా బసవేశ్వరుడి జయంతి
నివాళి అర్పిస్తున్న అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, అధికారులు

సిరిసిల్ల, మే 3 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సామాజిక తత్వవేత్త బసవేశ్వరుడి జయం తిని అధికారికంగా ఘనంగా నిర్వహించారు. మంగళవా రం  కలెక్టరేట్‌లో  అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌తోపా టు అధికారులు బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ మానవ సమానత్వాన్ని ప్రబోధించిన విశ్వగురువుగా బసవేశ్వరుడు అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కుల, వర్ణ, వర్గ, లింగ వివక్ష లేకుండా సమ సమాజ నిర్మాణం కోసం కొన్ని వందల ఏళ్ల క్రితమే బసవేశ్వరుడు కృషి చేశారన్నారు. ఆ కాలంలోనే మహిళా సాధికారిత కోసం పాటు పడిన మహోన్నతుడు బసవేశ్వరుడన్నారు. జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడి అడుగు జాడల్లో నడవాలన్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకు శ్రీకారం చుట్టిన మహోన్నతుడన్నారు. బసవేశ్వరుడి ఆచరణలు  నేటికి కొనసాగడం సంతోషకరమన్నారు. వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మోహన్‌రెడ్డి, డీపీఆర్వో మామిండ్ల  దశరథం తదితరులు పాల్గొన్నారు. 

పోలీసు కార్యాలయంలో..

బసవేశ్వర స్వామి సమాజంలో కుల వ్యవస్థను, వర్ణబేధాలను లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది అని  ఎస్పీ రాహుల్‌హెగ్డే  అన్నారు. పోలీస్‌ కార్యాలయంలో బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లింగాయత్‌ ధర్మం స్థాపిం చారని, చిన్న వయస్సులోని శైవ పురాణగాధలను అవగతం చేసుకున్నారని అన్నారు. రాజ్యపాలనలో ప్రధాన భూమిక పోషిస్తూ వచన కవిత్వంలో ప్రజలందరినీ కులమాతాలకు అతీతంగా ఏకం చేశారన్నారు. బోధనలోని సమదృష్టి ఎందరినో ఆకర్షించిందన్నారు. వీరశైవ మతానికి పట్టంగట్టిన బసవేశ్వరస్వామి కర్ణాటక ఎల్లలు దాటి తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందిందన్నారు.  

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వీరశైవ లింగాయత్‌ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో పురోహితుడు ఉమాశంకర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. బసవేశ్వరస్వామి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. సంఘం నాయకులు చిట్టి సోమ్‌కుమార్‌, చిట్టి భూమయ్య, ఆకుల రాములు, చిట్టి శంకర్‌, పోతుగంటి వీరేశం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Read more