బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నాం: టీటీడీ ఈవో ఏకే సింఘాల్
ABN, First Publish Date - 2020-08-16T15:46:12+05:30
సెప్టెంబరు 19 నుంచి 27వరకు జరిగే శ్రీవారి సాలకట్ల.. అక్టోబరు 16 నుంచి..
తిరుపతి(ఆంధ్రజ్యోతి): సెప్టెంబరు 19 నుంచి 27వరకు జరిగే శ్రీవారి సాలకట్ల.. అక్టోబరు 16 నుంచి 24వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని విభాగాలు సన్నద్ధమవుతున్నట్లు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక మైదానంలో శనివారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన భద్రతా సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొవిడ్ నిబంధనలకు లోబడి శ్రీవారి ఉత్సవాల నిర్వహణ ఉంటుందన్నారు. కొవిడ్ నేపథ్యంలో భక్తులకు సేవలందిస్తున్న ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. శ్రీవారి అనుగ్రహంతో త్వరలోనే ప్రపంచం కరోనా బారినుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం పలువురు ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్కుమార్, భార్గవి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, ఎఫ్అండ్ సీఏవో బాలాజీ, సీఈ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-16T15:46:12+05:30 IST