అనుమతించి.. ఆంక్షలు!
ABN, First Publish Date - 2020-04-05T08:56:46+05:30
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్రం అమలు చేస్తున్న లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల దుకాణాల నిర్వహణపై వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ఉన్నతాధికారుల ఆదేశాలను
- పట్టణాల్లో మాంసం, చేపల షాపులు తెరవొద్దంటూ హెచ్చరికలు
- లాక్డౌన్ నుంచి సడలింపు ఉన్నా క్షేత్రస్థాయి అధికారుల అత్యుత్సాహం
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్రం అమలు చేస్తున్న లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల దుకాణాల నిర్వహణపై వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ఉన్నతాధికారుల ఆదేశాలను క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలను నిత్యావసరాలుగా ప్రకటించినా, వాటి అమ్మకాలపై క్షేత్రస్థాయి అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో లాక్డౌన్ సడలింపు సమయంలోనూ అమ్ముకోలేక వ్యాపారులు నష్టపోతున్నారు. పౌల్ర్టీ, ఆక్వా ఉత్పత్తులను నిత్యావసరాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ సమయంలో రైతులు నష్టపోకుండా పండ్లు, కూరగాయలతో పాటు రొయ్యలు, చేపల రవాణాకు, చికెన్, మటన్ విక్రయాలకు సడలింపు ఇస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు సైతం ప్రకటించారు. కానీ కరోనా కేసులు ప్రబలాయన్న ఉద్దేశంతో ఈ ఆదివారం నుంచి ఏలూరులో చికెన్, మటన్ షాపులు తెరవొద్దంటూ మున్సిపల్ అధికారులు స్థానికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ దుకాణాల వద్దకు కొనుగోలుదారులు గుంపులుగా రావడమే ఇందుకు కారణమని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇలా వస్తున్న వారిని నియంత్రించాల్సిందిపోయి... చికెన్, చేపలు, మటన్ వ్యాపారులు నష్టపోయేలా క్షేత్రస్థాయి అధికారులు అత్యుత్సాహంతో ఆ దుకాణాలను మూయించడంపై విమర్శలు వస్తున్నాయి.
కోత కోస్తే కేసే!
మరోవైపు గ్రామాల్లో పోలీసులు సైతం ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. రైతులు నష్టపోకూడదని, తగు జాగ్రత్తలతో పంటపొలాల్లో పనులు చేయించుకోవచ్చని, ఈ విషయంలో పోలీసులు అడ్డుకోవద్దని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేస్తున్నారు. మిరప కోతలకు వెళ్లే కూలీలపై కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇకపై పొలం వెళ్తే కేసులు తప్పవంటూ గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూలీలకు ఫోన్లు చేసి మరీ హెచ్చరిస్తున్నారు. దీంతో కూలీలు కోతలకు దూరం కాగా, పంటను ఇంటికి ఎలా చేర్చుకోవాలో తెలియక రైతులు వాపోతున్నారు. మిరప పంటకు ఎకరాకు దాదాపు రూ.లక్ష వరకూ పెట్టుబడి అవుతుంది. అంతపెట్టి ఇప్పుడు పంటను ఇంటికి తెచ్చుకోలేకపోతే ఎంత నష్టం భరించాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2020-04-05T08:56:46+05:30 IST