నకిలీ నోట్ల ముఠా అరెస్టు
ABN, First Publish Date - 2020-10-13T06:38:13+05:30
అమాయకులకు నకిలీ నోట్లను ఎరగా వేసి అసలు నోట్లతో ఉడాయిస్తున్న ముగ్గురిని అంబాజీపేట పోలీసులు పట్టుకున్నారు.
అంబాజీపేట, అక్టోబరు 12: అమాయకులకు నకిలీ నోట్లను ఎరగా వేసి అసలు నోట్లతో ఉడాయిస్తున్న ముగ్గురిని అంబాజీపేట పోలీసులు పట్టుకున్నారు. అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్బాషా స్థానిక పోలీస్స్టేషన వద్ద వివరాలు వెల్లడించారు. ముక్కామలకు చెందిన ఓ వ్యక్తికి దొంగనోట్లను అందిస్తున్నారనే సమాచారంతో అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్బాబు ఆధ్వర్యంలో అంబాజీపేట ఎస్ఐ షేక్ జానీబాషా సిబ్బందితో దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. కొత్తపేట మండలం బిళ్లకుర్రుకు చెందిన చోడే హరినాథ్, పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం పి.వేమవరానికి చెందిన గంటి శ్రీనివాస్(రేకుల శ్రీను), అమలాపురానికి చెందిన మంగిగంటి మోహనరావులతోపాటు మరో ఇద్దరు యువకులు ముఠాగా ఏర్పడి అసలు నోట్లకు మూడింతలు నకిలీ నోట్లు ఇస్తామని ఎర వేస్తున్నారన్నారు. రూ.500 నకిలీనోట్ల రూ.3 లక్షలు, రెండు మోటార్సైకిళ్లు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఐ సురేష్బాబుతోపాటు ఎస్ఐ జానీబాషా, సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Updated Date - 2020-10-13T06:38:13+05:30 IST