అక్కడ జగన్ ఫొటోకు వంగి వంగి దండాలు పెట్టాల్సిందే...
ABN, First Publish Date - 2020-04-24T20:29:25+05:30
ఏపీలో వైసీపీ నేతల తీరు వివాదాస్పదంగా మారుతోంది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తలకెక్కుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో వైసీపీ నేత నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
అమరావతి: ఏపీలో వైసీపీ నేతల తీరు వివాదాస్పదంగా మారుతోంది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తలకెక్కుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో వైసీపీ నేత నిర్వాకం వెలుగులోకి వచ్చింది. సీఎం జగన్ ఫొటోకు గ్రామ వాలంటీర్లతో వంగివంగి దండాలు పెట్టిస్తున్నాడు. అంతేకాదు వారి చేత ‘జై జగన్, జోహార్ జగన్’ అంటూ నినాదాలు ఇప్పిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదంగా మారింది. జగన్ ఫొటో ముందు గ్రామ వాలంటీర్లు ఒక్కొక్కరిగా వచ్చి తలవంచుతున్న తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు జగన్ ఫొటో ముందు ఇలా సాగిలపడడం దుమారం రేపుతోంది. అసలు దేశంలోని ఎన్నడూ లేని విధంగా ఈ వింత పొకడలు చర్చనీయాంశంగా మారాయి.
రాజుల కాలంలో నియంతల ముందు బానిసలు, చక్రవర్తుల ముందు సామంతరాజులు వ్యవహరించిన తీరు ఇప్పుడు కనిపిస్తోంది. ఈ వింతపోకడలపై తీవ్రమైన విమర్శలు వెళ్లువెత్తున్నాయి. సహజంగా నమస్కారం పెట్టడం గౌవర సూచికంగా ఉంటుంది. అంతేకాని ఫొటోల దగ్గరకు వెళ్లి.. సాగిల పడటం, తలవంచటం అనే విధానం సంప్రదాయంలో కూడా చాలా హేయమైన చర్య. దీన్ని అందరూ తప్పుగా భావిస్తారు. ఎందుకోసం అంటే బతికి ఉన్నవాళ్ల ఫొటోల దగ్గరకు వెళ్లి తలవంచే సంప్రదాయం ఎప్పుడూ జరుగలేదు. సహజంగా ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఫొటో ముందు నిల్చొని నమస్కరిస్తారు. అయితే జగన్ బతికి ఉన్నప్పుడు ఎలా చేస్తారని పలువురు ప్రశ్నించిస్తున్నారు.
Updated Date - 2020-04-24T20:29:25+05:30 IST