కర్నూలులో ఇప్పటి వరకు ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..
ABN, First Publish Date - 2020-06-26T19:48:46+05:30
కొవిడ్ చికిత్స పొందుతున్న వారిలో గురువారం ఇద్దరు మృతి చెందారు. కలెక్టరేట్కూ వైరస్ పాకింది. లాక్డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత జిల్లాలో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కలెక్టరేట్లోని జిల్లా
ఇంకో ఇద్దరు మృతి..72 మందికి పాజిటివ్
కలెక్టరేట్కి పాకిన కరోనా
కర్నూలు(హాస్పిటల్): కొవిడ్ చికిత్స పొందుతున్న వారిలో గురువారం ఇద్దరు మృతి చెందారు. కలెక్టరేట్కూ వైరస్ పాకింది. లాక్డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత జిల్లాలో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ఓ ఉద్యోగికి, జిల్లా మైనార్టీ కార్యాలయంలో ఓ ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. దీంతో కలెక్టరేట్లో భద్రతను పెంచారు. కలెక్టర్ వద్ద ఓ గేటు మూసివేశారు. కర్నూలు రూరల్లో పని చేస్తున్న ఓ ఐసీడీసీ సూపర్వైజర్కు కరోనా సోకినట్లు సమాచారం. దీంతో అక్కడ పని చేస్తున్న 12 మందికి పరీక్షలు నిర్వహించారు. ఐసీడీఎస్ కార్యాలయంలో డిజిన్ఫెక్షన్ చర్యలు చేపట్టారు.
మరో 72 కేసులు:
జిల్లాలో మరో 72 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 1555కి చేరింది. నగరంలో అత్యధికంగా 40 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు 729 కేసులు నమోదయ్యాయి. ఇందులో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 444 మంది డిశ్చార్జి అయ్యారు.
ఆదోనిలో 15 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసులు 335కు చేరాయి. 220 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రూరల్ పరిధిలో మరో ఆరుగురు వైరస్ బారిన పడ్డారు.
నంద్యాల మున్సిపాలిటీలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసులు 170కి చేరాయి.
నందికొట్కూరు మున్సిపాలిటీలో ఇద్దరు మహిళలకు వైరస్ సోకింది. మొత్తం కేసులు 14కు చేరాయి.
ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో గర్భిణికి పాజిటివ్ వచ్చింది.
ఆస్పరి మండలం ముత్తుకూరులో ఒకరికి వైరస్ సోకింది. చిప్పగిరి మండలం నేమకల్లులో ఇద్దరు బాలికలకు పాజిటివ్ వచ్చింది. చిప్పగిరిలో మొత్తం ఆరు కేసులు ఉన్నాయి.
శిరివెళ్లకు చెందిన ఓ ఆర్టీసీ కండక్టర్కు పాజిటివ్ వచ్చింది. ఆయన ఆళ్లగడ్డ డిపోలో పని చేస్తున్నారు.
పత్తికొండలో ఒకరికి వైరస్ సోకింది. మొత్తం కేసులు 14కు చేరా యి. కల్లూరులో ఒకరికి సోకింది. కేసుల సంఖ్య మూడుకు చేరింది.
జిల్లా కోర్టు సముదాయంతో పాటు మున్సిప్ కోర్టు సముదాయాలలో పని చేసే ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ రిపోర్టు రావడం కలకలం రేపింది.
ఇద్దరు మృతి
ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా చికిత్స పొందుతూ కర్నూలు జీజీహెచ్లో మరణించారు. ఆదోనిలో మొత్తం మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. కర్నూలు నగరంలో ఓ వ్యక్తి మృతి చెందారు. కర్నూలు నగరంలో మృతుల సంఖ్య 28కి చేరింది. జిల్లాలో ఇప్పటిదాకా 44 మంది కొవిడ్తో మరణించారు.
28 మంది డిశ్చార్జి
జిల్లాలో 28 మంది కరోనా నుంచి విముక్తి పొందారు. కర్నూలు జీజీహెచ్ స్టేట్ కొవిడ్ ఆసుపత్రి నుంచి 9 మంది, నంద్యాల జిల్లా ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రి నుంచి 19 మంది డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1183కి చేరింది. వీటిలో 855 మంది జిల్లా వాసులు కాగా, 328 మంది ఇతర రాష్ట్రాల నుంచి వారు.
Updated Date - 2020-06-26T19:48:46+05:30 IST