సచివాలయ వ్యవస్థతో బద్ధకస్తులుగా పంచాయతీ కార్యదర్శులు
ABN, First Publish Date - 2020-12-29T04:43:29+05:30
సచివాలయ, గ్రామ వార్డు వ్యవస్థతో పంచాయతీ కార్యదర్శులు బద్దకస్తులుగా తయారయ్యారని శాసనసభ్యుడు మానుగుంట మహీధర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశంలో ఎమ్మెల్యే మహీధర్రెడ్డి
ఉలవపాడు, డిసెంబరు 28 : సచివాలయ, గ్రామ వార్డు వ్యవస్థతో పంచాయతీ కార్యదర్శులు బద్దకస్తులుగా తయారయ్యారని శాసనసభ్యుడు మానుగుంట మహీధర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీల ఆదాయ వనరుల పెంపు విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచడం లేదన్నారు. పంచాయతీలలో విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయని, మండలంలో సుమారు 2 కోట్ల 60 లక్షల రూపాయల బకాయలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికి సరాసరి 30 శాతం పన్నులు వసూళ్లు కూడా చేపట్టలేదన్నారు. జనవరి 29వ తేదీన మరోమారు సమావేశం జరుగుతుందని అప్పటికల్లా పంచాయతీ కార్యదర్శులు వారి పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్, తహసీల్దార్ సంజీవరావు, ఈవోఆర్డీ చెంచమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాయబ్రసూల్, ఏవో వీవీ శేషమ్మ, ఏపీఎం చిన్నయ్య పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T04:43:29+05:30 IST