పార్టీ నుంచి వైసీపీ నేత మళ్ల తులసీరామ్ సస్పెండ్
ABN, First Publish Date - 2020-12-27T04:19:18+05:30
పెందుర్తికి చెందిన వైసీపీ నాయకుడు మళ్ల తులసీరామ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని ఎమ్మెల్యే అదీప్రాజ్ తెలిపారు.
పెందుర్తి, డిసెంబరు 26: పెందుర్తికి చెందిన వైసీపీ నాయకుడు మళ్ల తులసీరామ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని ఎమ్మెల్యే అదీప్రాజ్ తెలిపారు. తన పేరు చెప్పి సెటిల్మెంట్కు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న అభియోగంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. రాంపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరవ సర్వే నంబర్ 5లో గల భూముల వ్యవహారంలో కొన్ని అనుమతులు కోసం తన పేరు చెప్పి స్థిరాస్తి వ్యాపారి వద్ద డబ్బులు వసూలు చేశారని ఓ చానల్లో ఆడియో టేపులతో ఫోన్ సంభాషణ ప్రసారం అయిందన్నారు. మళ్ల తులసీరామ్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇందులో ప్రమేయం ఉందని భావిస్తున్న మట్టా ప్రసాద్ అనే వైసీపీ కార్యకర్త పాత్ర పైనా విచారణ చేపడతామని చెప్పారు. తన పేరు చెప్పి డబ్బుల వసూళ్లకు పాల్పడితే పార్టీలో ఎంతటి స్థాయిలో ఉన్న వారిపైనైనా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవిసాంబ, వైసీపీ నాయకులు భగవాన్జయరామ్, నక్క కనకరాజు, ఎల్బీ నాయుడు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-27T04:19:18+05:30 IST