పెట్రోలు, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.3 పెంపు
ABN, First Publish Date - 2020-03-15T07:48:04+05:30
కరోనా ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో.. ఆ మేరకు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాల్సి ఉండగా.. ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ డ్యూటీని పెంచింది.
న్యూఢిల్లీ, మార్చి 14: కరోనా ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో.. ఆ మేరకు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాల్సి ఉండగా.. ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోనుంది. ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం కూడా ఉండదని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు పేర్కొంది. అయితే ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి మాత్రం ఏటా రూ.39 వేల కోట్ల ఆదాయం అదనంగా సమకూరనుంది. ఈ పెంపు ఫలితంగా పెట్రోలుపై మొత్తం ఎక్సైజ్ డ్యూటీ రూ.22.98కి, డీజిల్పై రూ.18.83కు చేరనుంది. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లో ఇది పెట్రోలుపై రూ.9.48, డీజిల్పై రూ.3.56గా ఉండేది. ఈ నేపథ్యంలో తాజా ఎక్సైజ్ డ్యూటీ పెంపును ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుబట్టింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గుదలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసింది.
Updated Date - 2020-03-15T07:48:04+05:30 IST