ఢిల్లీలో ఒకే చోట ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఉండరాదు : కేజ్రీవాల్
ABN, First Publish Date - 2020-03-21T23:48:58+05:30
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఒకే చోట ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఉండటంపై నిషేధం విధించింది.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఒకే చోట ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఉండటంపై నిషేధం విధించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఓ వీడియో సందేశం ద్వారా తెలిపిన వివరాల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కడైనా ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఉండటాన్ని అనుమతించరు. సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన, విద్యాపరమైన, సెమినార్లు, సదస్సుల్లో కూడా ఐదుగురి కన్నా ఎక్కువ మంది పాల్గొనేందుకు అనుమతించరు.
ఒక వేళ ఈ పరిమితికి మించిన సంఖ్యలో వ్యక్తులు ఒక చోట చేరవలసి వస్తే, ఒకరి నుంచి మరొకరు ఒక మీటరు దూరంలో ఉండేలా చూసుకోవాలని కేజ్రీవాల్ తెలిపారు. గతంలో ఈ పరిమితి 20 మంది వ్యక్తులుగా ఉండేది. దీనిని సవరించి తాజాగా ఐదుగురు మాత్రమే ఒక చోట ఉండేందుకు అనుమతిస్తూ, నిబంధనలు రూపొందించారు.
జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలు బయటకు రావలసిన అత్యవసర పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో 50 శాతం ఢిల్లీ రవాణా సంస్థ బస్సులను నడుపుతామని తెలిపారు. మెట్రో రైళ్లు కూడా నడవడం లేదని, అందువల్ల అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు రవాణా సదుపాయం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో 50 శాతం బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-03-21T23:48:58+05:30 IST