ఒక్క రోజే ‘రికార్డు’ కేసులు
ABN, First Publish Date - 2020-06-04T07:20:30+05:30
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతమవుతోంది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయానికి 1.98 లక్షల కరోనా కేసులు ఉండగా, బుధవారం ఉదయానికి ఈ సంఖ్య 2,07,615కు పెరిగిపోయింది...
- దేశంలో కొత్తగా 8909 పాజిటివ్లు
- మరణాలు 217.. మొత్తం 5815
న్యూఢిల్లీ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతమవుతోంది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయానికి 1.98 లక్షల కరోనా కేసులు ఉండగా, బుధవారం ఉదయానికి ఈ సంఖ్య 2,07,615కు పెరిగిపోయింది. ఒక్క రోజులోనే 8909 మంది వైరస్ బారినపడ్డారు. ఒక్క రోజు నమోదైన కేసుల్లో ఇదే రికార్డు. వరసగా నాలుగు రోజుల పాటు కొత్త కేసుల సంఖ్య 8 వేలు దాటడం గమనార్హం. ఇక గడిచిన 24 గంటల్లో 217 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృ తుల సంఖ్య 5815కి చేరింది. 4,776 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,01,497 మంది చికిత్స పొందుతుండగా, 1,00,303 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. మొత్తం కేసులు, మరణాల్లో అత్యధికం మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 74,860కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 6 శాతం ఉండగా, మన దేశంలో 2.8 శాతంగా ఉంది. కేసుల సంఖ్య రోజూ వేలల్లో పెరుగుతున్నప్పటికీ అదే నిష్పత్తిలో మరణాలు పెరగకపోవడం కొంత ఉపశమనంగా భావించవచ్చు. కరోనా సోకిన వారిలో 48.31ు కోలుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
ఒక్కరోజులో 1.37లక్షల పరీక్షలు
దేశవ్యాప్తంగా 688 ప్రభుత్వ, ప్రైవేటు లేబొరేటరీల్లో గడిచిన 24గంటల్లో కరోనా పరీక్షల కోసం 1,37,158 నమూనాలు తీసుకోగా 8,909 పాజిటివ్లు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 41,03,233 శాంపిల్స్ పరీక్షించినట్లు వెల్లడించారు.
- గోవాలోని ఓ కట్టడి ప్రాంతంలో పరీక్షలు నిర్వహించగా 40 పాజిటివ్లొచ్చాయి. ఒక్క కుటుంబం తప్పిదంతో కేసుల సంఖ్య పెరిగిందని, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 65కి చేరిందని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.
- ఎయిమ్స్లో కొవిడ్ బారిన పడ్డవారి సంఖ్య 329కి చేరగా.. వీరిలో 47 మంది నర్సింగ్ సిబ్బందే.
- ఢిల్లీలోని కేంద్ర న్యాయ శాఖ కార్యాలయంలో సీనియర్ అధికారికి పాజిటివ్ వచ్చింది. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్కి కరోనా లక్షణాలు కనిపించాయి.
- తమిళనాడులో ఒకే రోజు రికార్డు స్థాయిలో 1286 కొత్త కేసులు నమోదయ్యాయి.
కర్ణాటకపై ‘మహా’ ప్రభావం
మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు తిరిగి వచ్చినవారిలో ఎక్కువమంది కరోనా బారిన పడుతున్నారు. బుధవారం రాష్ట్రంలో 267 మందికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 4,063కు చేరింది. తాజా కేసుల్లో 235 మంది మహారాష్ట్ర నుంచి వచ్చినవారే ఉన్నారు.
Updated Date - 2020-06-04T07:20:30+05:30 IST