కొవిడ్ కష్టాలతో ఆకలి చావులు?
ABN, First Publish Date - 2020-09-13T07:02:51+05:30
కరోనా వ్యాప్తితో అలుముకు న్న ఆరోగ్య విపత్తు ఎంతో మంది ప్రాణాలను బలిగొంది.
పేద దేశాల్లో అధ్వాన్న పరిస్థితి
వాషింగ్టన్, సెప్టెంబరు 12: కరోనా వ్యాప్తితో అలుముకు న్న ఆరోగ్య విపత్తు ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. దాని అలజడి ఇంతటితో ఆగకపోవచ్చని, కొవిడ్ సంక్షోభంతో ఆర్థికంగా కుదేలైన దేశాల్లో ఆకలి చావులకు దారితీయొచ్చని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో ప్రజలు ఉపాధిని కోల్పోయి ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అక్కడి ప్రజల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని, ఫలితంగా పౌష్టికాహారాన్ని, తాజా కూరగాయలను కూడా కొనలేని దుస్థితిని వారు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదం ఉందంటూ ఓ అధ్యయన నివేదిక ‘ది లాన్సెట్’ జర్నల్లో ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య ఈ ఏడాది మరో 70 లక్షలు పెరగొచ్చన్నారు. ఆహార భద్రతకు నోచుకోని ప్రజల సంఖ్య ఈ ఏడాది రెట్టింపై 26.5 కోట్ల మందికి పెరగనుందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (యూఎన్డబ్ల్యూఎ్ఫపీ) ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, లాక్డౌన్తో మధ్యాహ్న భోజనానికి దూరమైన పిల్లలకు బలవర్ధక ఆహారాన్ని ప్రవేశ పెట్టాలని, రేషన్ పరిమాణాన్ని పెంచాలని యూఎన్డబ్ల్యూఎఫ్పీ డైరెక్టర్ బిషో పరాజులీ సూచించారు.
Updated Date - 2020-09-13T07:02:51+05:30 IST